కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మళ్లీ పెరిగింది. ఈసారి మరో 4 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కరవు భత్యం 42 శాతంగా ఉండగా.. తాజా పెంపుతో కలిపి 46 శాతానికి చేరింది. దీపావళికి ముందు ఈ ప్రకటనతో ఉద్యోగులకు పండగ ముందే వచ్చినట్లయింది.
7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రి వర్గం డీఏ పెంచింది. సాధారణంగా డీఏను (డియర్నెస్ అలవెన్స్) ఏటా కేంద్రం రెండు సార్లు సవరిస్తుంటుంది. జనవరి, జులైల్లో సవరించాల్సి ఉన్నప్పటికీ.. దీనిని మార్చి, అక్టోబర్లో పెంచుతూ వస్తుంది. అయితే ఇదే క్రమంలో బకాయిల్ని కూడా చెల్లిస్తుంది. ఉద్యోగులకు డీఏ పెరగగా.. పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ పెరుగుతుందని చెప్పొచ్చు.
కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఉద్యోగులకు కాలానుగుణంగా డీఏ పెంచుతూ ఉంటుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం వరుసగా పెరుగుతున్న వేళ డీఏ పెంచుకుంటూ పోతోంది. గతేడాది మొదట 31 నుంచి 3 శాతం పెంచి 34 శాతానికి, తర్వాత మరో 4 శాతం పెంచి 38 శాతానికి చేర్చగా, ఈ ఏడాది మార్చిలో మరో 4 శాతం పెంచి 42 శాతానికి చేర్చింది.
తాజాగా మరో 4 శాతంతో కలిపి అది 46 శాతానికి చేరింది. ఈసారి అక్టోబర్లో డీఏ పెంచగా నవంబర్ జీతంతో ఇది కలిపి వస్తుందని చెప్పొచ్చు. అదే సమయంలో జులైలో పెరగాల్సి ఉండగా, జులై, ఆగస్టు, సెప్టెంబర్ బకాయిలు కూడా జీతానికి కలిపి వస్తాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ఇండస్ట్రియల్ వర్కర్స్- లేటెస్ట్ కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా లెక్కిస్తారు. తాజా పెంపుతో సుమారు 48 లక్షలకుపైగా ప్రభుత్వ ఉద్యోగులకు.. అదే విధంగా.. 69 లక్షల మందికిపైగా పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. మొత్తం కోటి మందికిపైగా లబ్ధి పొందనున్నారు.