ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2022-23లో మొత్తం 2,68,923 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో అడుగుపెట్టారని, కిందటి ఏడాదితో పోల్చుకుంటే విద్యార్థుల సంఖ్య 35 శాతం పెరిగిందని ‘ఓపెన్ డోర్స్’ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం అమెరికాలోని విద్యా సంస్థల్లో దాదాపు 10 లక్షల మందికిపైగా అంతర్జాతీయ విద్యార్థులు వివిధ కోర్సులు చదువుతున్నారు. ఇందులో భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 25 శాతానికి చేరుకుంది. అమెరికాలో విద్యా అవకాశాలు, సమగ్రమైన, కచ్చితమైన, తాజా సమాచారం కోసం ఆ దేశ విదేశాంగ శాఖ 6 ఉచిత సలహా కేంద్రాల్ని భారత్లో ఏర్పాటుచేసింది.
ఇందులో రెండు కేంద్రాలు హైదరాబాద్లో ఉండటం గమనార్హం. ‘ఓపెన్ డోర్స్ రిపోర్ట్ డాటా’ ప్రకారం, ఈ సారి గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్లో 1.65 లక్షల మందితో 62.6 శాతం పెరుగుదల నమోదైంది. గత ఏడాదితో పోల్చుకుంటే సుమారు 64 వేలమంది అధికంగా అమెరికాకు వెళ్లారు.
అలాగే, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 16 శాతం పెరుగుదల నమోదైంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)కు అవకాశం కల్పించే కోర్సుల్లో భారత్ నుంచి 69 వేల మంది అడ్మిషన్లు పొందారు. తాజా అకాడమిక్ సంవత్సరంలో అమెరికా యూనివర్సిటీల్లో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 12శాతం పెరిగింది. గత 40 ఏళ్లలో ఈ స్థాయిలో పెరగడం ఇదే గరిష్ఠం.
ఓపెన్డోర్స్ నివేదిక ప్రకారం, 2009-10 తర్వాత మొదటిసారి అమెరికాలో అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులలో చైనాను భారత్ అధిగమించింది. అంతే కాకుండా గతేడాదితో పోల్చితే యూఎస్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 63 శాతం పెరిగి 1,65,936కి పెరిగింది. అదే సమయంలో అండర్ గ్రాడ్యుయేట్ల సంఖ్య 16శాతం పెరిగింది. అలాగే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఒపిటి)ని ఎంచుకున్న విదేశీ విద్యార్థులలోనూ భారతీయులే (69,062) ముందున్నారు.
అర్హులైన విద్యార్థులు తమ అధ్యయన రంగంలో ప్రాక్టికల్కు వీలుగా ఒకవిధమైన తాత్కాలిక పని లైసెన్స్ను ఒపిటి అనుమతిస్తుంది. 2023 జూన్-ఆగస్టులో భారత్లోని యూఎస్ ఎంబసీ, కాన్సులేట్లు అత్యధిక సంఖ్యలో విద్యార్థి వీసాలను మంజూరు చేశాయి. ఈ కాలంలో ఎఫ్, ఎం, జె కేటగిరీలలో 95,269 వీసాలను మంజూరు చేశారు. గతేడాది ఇదే వ్యవధితో పోల్చితే 18శాతం అధికం.
భారత్, చైనా తర్వాత బంగ్లాదేశ్ (28శాతం), కొలంబియా, ఘనా ((32శాతం), భారత్ (35శాతం), ఇటలీ, నేపాల్ (28శాతం), పాకిస్థాన్ (16శాతం) విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్యకు ప్రవేశాలు పొందారు. అమెరికా గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లలో విదేశీ విద్యార్థులు ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ, బిజినెస్ విభాగాల్లోనే నమోదు చేసుకుంటున్నారు.
కొంతకాలంగా ఈ ప్రోగ్రామ్లలో 21 శాతం పెరుగుదల కనిపించగా, యూజీల్లో ఒక శాతం పెరిగింది. గణితం, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్లలో చాలా పురోగతి కనిపిస్తోంది. ఆ తర్వాత ఇంజినీరింగ్, బిజినెస్ విభాగాలు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ విద్యార్థులకు గమ్యస్థానంగా ఉన్న ఇలినోయ్, టెక్సాస్, మిషిగాన్లు సహా 24 రాష్ట్రాల్లో చైనా కంటే భారతీయ విద్యార్థులే అధికంగా ఉండటం విశేషం.