* తెలంగాణాలో కాంగ్రెస్ విజయం
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భాగంగా ఉత్తరాదిన ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ లలో కాంగ్రెస్ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. సాయంత్రం 5 గంటలకు వెలువడ్డ ఫలితాల ప్రకారం ఈ మూడు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ వ్యతిరేక ఫవనాలు వీస్తున్నాయి. బిజెపి ఘనవిజయాలు సాధించి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నది.
మధ్యప్రదేశ్ లోని 230 సీట్లలో బిజెపి 167 సీట్ల వరకు గెల్చుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ 67 సీట్లకే పరిమితం కానుంది. బిజెపికి ఆ ఇన్ని సీట్లు రావడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ లో సహితం ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 200 సీట్లలో 101 సీట్లకు మించి 121 సీట్ల మేరకు బిజెపి గెల్చుకొంటున్నది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ 64 సీట్లకు పరిమితం అవుతుంది.
కాంగ్రెస్ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలను తలకిందులు చేస్తూ 90 సీట్లలో బిజెపి 55 సీట్లు గెల్చుకొంటుండగా, కాంగ్రెస్ 35 సీట్లకు పరిమితం అవుతుంది. తెలంగాణాలో సహితం 119 సీట్లలో కాంగ్రెస్ 64 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నది. అధికారమలో ఉన్న బిఆర్ఎస్ 39 సీట్లకు పరిమితం అవుతుంది. బిజెపి అనూహ్యంగా 9 సీట్లు గెల్చుకొంటున్నది. ఎంఐఎం 6 సీట్లకు పరిమితం కానుంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మధ్యప్రదేశ్లో అధికారాన్ని నిలబెట్టుకున్న ఆ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం వెలువడిన ఫలితాలను సరళి బట్టి ఆ పార్టీ మూడు రాష్ట్రాల్లోనూ బిజెపి మ్యాజిక్ మార్క్ను దాటేసింది. ఛత్తీస్గఢ్లో గెలుపు ఖాయమనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు ఊహించని షాకిచ్చారు.
అటు మధ్యప్రదేశ్లోనూ గెలుపుపై భారీ ఆశలు పెట్టుకున్న హస్తం పార్టీ అక్కడా చుక్కెదురయ్యింది. గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ, గ్వాలియర్ యువరాజు జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో కమలనాథ్ సర్కార్ 14 నెలలకే కూలిపోయింది.
మధ్య ప్రదేశ్ లో బీజేపీ విజయానికి ప్రధాన కారణం ప్రధాని మోదీయేనని రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ నిర్వహించిన ప్రచారం, ప్రజలకు ఆయనపై ఉన్న విశ్వాసం కారణంగానే మధ్య ప్రదేశ్ లో మళ్లీ విజయం సాధిస్తున్నామని అన్నారు. ‘‘రాష్ట్ర ప్రజల మనసుల్లో మోదీ ఉన్నారు. మోదీ మనసులో రాష్ట్ర ప్రజలు ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉండడంతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేయగలిగామని తెలిపారు.
ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకతకు ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలే నిదర్శనమని తెలిపారు. ప్రజలు ఓటింగ్ ద్వారా కాంగ్రెస్కు బుద్దిచెప్పారని రమణ్ సింగ్ అన్నారు. నాలుగు గంటల వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. 90 సీట్లు ఉన్న ఛత్తీస్గఢ్లో బీజేపీ ఏకంగా 56 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తుండగా కాంగ్రెస్ 32 స్థానాల్లో ముందంజలో ఉంది. గోండ్వానా గణతంత్ర పార్టీ (జీజీపీ) ఒక స్థానంలో ముందుండగా బహుజన్ సమాజ్ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంలో ముందంజలో ఉంది.