‘ఆమ్ ఆద్మీ పార్టీ ’ లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. డీడీయూ మార్గ్లోని ఆప్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ప్రచారాన్ని ప్రారంభించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ “నా కుటుంబంగా ఉన్న ఢిల్లీ ప్రజలకు సేవ చేసేందుకు నేను అన్ని ప్రయత్నాలు చేశాను. ఆప్ పాలిస్తున్న ఢిల్లీ, పంజాబ్లలో మాత్రమే ఉచిత విద్యుత్ సరఫరా ఉంది” అని తెలిపారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆప్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి ప్రాజెక్ట్ను నిలిపివేస్తుందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.
ఏడుగురు ప్రతిపక్ష అభ్యర్థులను పార్లమెంటుకు పంపడం ద్వారా తనను “బలపరచాలని” ప్రజలను కోరారు. ఢిల్లీలో ఎన్నుకుని అధికారంలోకి తెచ్చినందుకే ఆ వ్యక్తి మిమ్మల్ని ద్వేషిస్తున్నారని పేర్కొన్నారు. మొహల్లా క్లినిక్లను బుల్డోజర్లతో కూల్చివేశారని, ఇంటింటికీ రేషన్ డెలివరీ పథకాన్ని, ఆసుపత్రుల్లో పరీక్షలు, మందులను నిలిపివేశారని ఆయన ఆరోపించారు
పార్లమెంటులో బలపడటం ద్వారా ఢిల్లీ ప్రజల అభ్యుదయానికి మరింత పాటుపడగలమని, అందుకోసం పట్టుదలగా పనిచేయాలని కార్యకర్తలకు కేజ్రీవాల్ దిశానిర్దేశం చేశారు.
కాగా, ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన ఆప్ ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్, హర్యానాలో కాంగ్రెస్తో పొత్తులు ఖరారు చేసుకుంది. పొత్తులో భాగంగా ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లో 4 స్థానాల్లో ఆప్, 3 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పొత్తుతో గుజరాత్లోని బరూచ్, జామ్నగర్, హర్యానాలోని కురుక్షేత్ర నుంచి ఆప్ పోటీ చేస్తోంది.
అయితే పంజాబ్లో ఆప్ ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తోంది. అసోంలోని గువాహటి, డిబ్రూగఢ్, సోనిపట్ లోక్సభ నియోజకవర్గాలకు కూడా ఆప్ తమ అభ్యర్థులను ప్రకటించింది.