పశ్చిమ బెంగాల్ లో . అత్యంత అమానవీయంగా జరిగిన హింసాకాండలో 8మంది సజీవ దహనమయ్యారు. ఇళ్ళల్లో బంధించి మరీ ఇళ్ళకు నిప్పంటించారు. అక్కడ అధికారమలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ లోని కుమ్ములాటలు ఫలితమే ఈ అమానుషం చోటుచేసుకోవడం గమనార్హం. బీర్భం జిల్లాలోని భక్తు గ్రామంలో సోమవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది.
హింసను గవర్నర్ జగ్దీప్ ధన్కర్ తీవ్రంగా ఖండించారు. మానవ హక్కులు కాలరాయబడ్డాయని, చట్టబద్ధ పాలన తొక్కివేయబడిందని విమర్శించారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియచేశారు. ఈ సంఘటన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్పై ప్రతిపక్షం తీవ్రంగా ధ్వజమెత్తింది.
హోం శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. కాగా ఈ హింసకు నిరసనగా 22మంది బిజెపి ఎంఎల్ఎలు అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఈ హింసాత్మక ఘటనపై నివేదికను సమర్పించాలని కేంద్రం కోరింది. ఈ హింసాకాండపై విచారణకు బిజెపి నిజనిర్ధారణ కమిటీని కూడా పంపుతోంది. బెంగాల్కు చెందిన బిజెపి బృందం కేంద్ర హోం మంత్రి అమితషాను ఈ ఘటనలో జోక్యం చేసుకోవాలని కోరింది.
తృణమూల్ కాంగ్రెస్ డిప్యూటీ ప్రధాన్ హత్య జరిగిన అనంతరం చెలరేగిన ఈ హింసాకాండలో అనేక ఇళ్లు దగ్ధమయ్యాయని, ఒకే ఇంట్లో ఏడు కాలిన మృత దేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి కాలిన గాయాలతో బీర్భం ఆస్పత్రిలో మరణించాడని చెప్పారు.
తృణమూల్ నేత హత్యకు, ఈ హింసకు మధ్య గల సంబంధంపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారని డిజిపి మనోజ్ మాలవీయ తెలిపారు. దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. అందులో ఎడిజి సిఐడి జ్ఞాన్వంత్ సింగ్, బర్ద్వాన్ జోన్ ఐజి బి.ఎల్.మీనా, డిఐజి సిఐడి (ఆపరేషన్స్) మీరజ్ ఖలీద్లు ఈ బృందంలో సభ్యులుగా వున్నారు.
”ఇది రాజకీయ శతృత్వం కాదు, రెండు గ్రూపుల మధ్య పాతుకుపోయిన వ్యక్తిగత కక్షలై వుండవచ్చని” డిజిపి వ్యాఖ్యానించారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి 11మందిని ఇప్పటివరకు అరెస్టు చేశారు. సోమవారం సాయంత్రం తృణమూల్ నేత భాదు షేక్పై కొంతమంది దుండగులు బాంబులు విసిరారు. తీవ్రమైన గాయాలతో అతను చనిపోయాడని, ఆ తర్వాత కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు 10 నుండి 12ఇళ్ళకు నిప్పంటించారని గ్రామస్తులు తెలిపారు.
గవర్నర్ ఆవేదన
”రాష్ట్రంలో హింసా సంస్కృతి నెలకొందని, చట్టబద్ధత కొరవడిందని” వ్యాఖ్యానించారు. రాంపుర్హట్లో చోటు చేసుకున్న ఆటవిక సంఘటనలు తననెంతగానో కలిచివేశాయని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన అధికార ట్విట్టర్ ద్వారా వీడియో సందేశమిస్తూ, ”ఇది భయంకమైన హింస, దహనం” గా అభివర్ణించారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి తాజా సమాచారాన్ని కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఇదొక తార్కాణమని చెప్పారు.
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందార్ మాట్లాడుతూ, రాష్ట్రపతి పాలన దిశగా పశ్చిమ బెంగాల్ పయనిస్తోందని వ్యాఖ్యానించారు. కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ శ్రీవాస్తవ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లామని రేపు ఈ కేసును విచారించనున్నారని తెలిపారు. బిజెపి నేత సువేందు అధికారి మాట్లాడుతూ, తణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.
ఇది ఊచకోతేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈ దారుణ సంఘటనను అణచివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. దర్యాప్తును, వాస్తవాలను తొక్కిపట్టి వుంచేందుకే సిట్ను ఏర్పాటు చేశారని అన్నారు.
కాగా, మంత్రి ఫర్హాద్ హకీమ్ నేతృత్వంలో ఇద్దరు సభ్యుల తృణమూల్ ప్రతినిధి బృందం రాంపుర్హట్కు బయలుదేరి వెళ్ళిందని పార్టీ వర్గాలు తెలిపాయి.