సుప్రసిద్ధ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కుమార్తె నిడుమోలు మాలా మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మద్రాస్ హైకోర్టుకు న్యాయవాదుల కోటాలో ఆరుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా వీరిలో మాలా, ఎస్.సౌందర్ల పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
ఈమేరకు కేంద్ర న్యాయశాఖ అదనపు కార్యదర్శి రాజేందర్ కశ్యప్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశ్రీ-సరోజా దంపతుల నలుగురి సంతానంలో చిన్నవారైన మాలా మద్రాస్ లా కళాశాల నుంచి డిగ్రీ పొందారు. ఆమె 1989లో మద్రా్స-పుదుచ్చేరి బార్ అసోసియేషన్లో నమోదయ్యారు. 32 ఏళ్లుగా మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్నారు.
2020 నుంచి పుదుచ్చేరి ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మాలా భర్త నిడుమోలు రాధారమణ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో ఉన్నతాధికారిగా ఉన్నారు. వారిది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా. మాలా-రాధా రమణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు శ్రీనివాస్ జయప్రకాశ్ కూడా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు.
కాగా, సుప్రీంకోర్టు కొలీజియం కొత్తగా తొమ్మిది మందిని దేశంలోని ఐదు హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించింది. వీరిలో ఆరుగురు న్యాయవాదులు, మిగిలిన ముగ్గురు జ్యుడీషియల్ అధికారులని న్యాయమంత్రిత్వశాఖ గురువారం ట్వీట్ చేసింది.
న్యాయవాదులైన రాహుల్ భర్తీ, మోక్షా ఖజూరియా కాజ్మీలను జమ్మూకశ్మీర్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. వీరిలో తొలుత ఖాజ్మీని 2019 అక్టోబరులో, రాహుల్ను గతేడాది మార్చిలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా, ఆ ఇద్దరి పేర్లను గతేడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం తిప్పిపంపింది. దీంతో గతేడాది చివరిలో వీరిద్దరి పేర్లను మరోసారి సుప్రీం కొలీజియం సిఫారసు చేయగా, ఎట్టకేలకు కేంద్రం ఇప్పుడు ఆమోదించింది.