మంత్రి కేటీఆర్ పాతబస్తీలో మజ్లిస్ పార్టీ నాయకుడి మాదిరి మాట్లాడారని బీజేపీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ విమర్శించారు. ఓవైసీల మెప్పు కోసం మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దారుస్సలాం ఆదేశాలను పాటించే టీఆర్ఎస్కు బీజేపీని విమర్శించే స్థాయిలేదని స్పష్టం చేశారు.
తుచ్ఛమైన ఓట్ల కోసం టీఆర్ఎస్ నేతలు బిచ్చగాళ్ళ మాదిరి మారిపోయారని లక్ష్మణ్ మండిపడ్డారు. పాత బస్తీలో కనీసం తనిఖీలు చేపట్టే దమ్ము ఉందా? విద్యుత్ బకాయిలు వసూలు చేసే దమ్ముందా? అని సవాల్ విసిరారు. మజ్లీస్ హుకుం జారీ చేస్తే కానీ పాత బస్తీలో అడుగు పెట్టలేని పరిస్థితి టీఆర్ఎస్దని ఎద్దేవా చేశారు.
పోలీసులు, అధికారులపై ఎంఐఎం దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి రాముడి పేరు పెట్టుకున్న కేటీఆర్.. ఏనాడైనా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారా? అని ప్రశ్నించారు.
యూపీలో రేషన్ పొందుతోన్న వారిలో ముస్లింలే ఎక్కువ మంది ఉన్నారని ఆయన చెప్పారు. ఒక మతం ఓట్ల కోసం హిందు పండితులు, దేవతలపై అడ్డగోలుగా అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. భవిష్యత్లో వారికి నూకలు చెల్లినట్లే అని హెచ్చరించారు.
కేసీఆర్ భైంసాలో జరిగిన దాడుల గురించి ఎందుకు మాట్లాడరని లక్ష్మణ్ నిలదీశారు. చార్మినార్ వద్ద ఉన్న మసీదుకు వెళ్లిన కేటీఆర్ ఏనాడైనా అక్కడే ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారా? అని ప్రశ్నించారు.
ఖమ్మం ఘటనలో మంత్రి పువ్వాడ అజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రశాంత్ కిషోర్.. కేంద్రంలో కాంగ్రెస్ను, రాష్ట్రంలో టీఆర్ఎస్ను అధికారంలోకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.