శనివారం సాయంత్రం నడిచిన హైడ్రామా మధ్య అమరావతి ఎంపి, నటి నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రానాను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా చదువుతామని వీరిద్దరు సవాలు చేయడంతో సబర్బన్ ఖర్లోని వారి నివాసం వద్ద ఉద్రికత్త నెలకొంది.
శివసేన కార్యకర్తలు వారి ఇంటిని చుట్టుముట్టడంతో వారు తాము సవాలును వెనక్కి తీసుకున్నారు. అనంతరం నవనీత్, రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఐపిసిలోని 153(ఎ)సెక్షన్ కింద వీరిద్దరిపై కేసు నమోదైంది. నవనీత్ కౌర్ దంపతులను అరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
పోలీసుల చర్యపై నవనీత్ కౌర్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ ఉగ్రవాద చర్యలకు పాల్పడటం లేదని, సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని మాత్రమే చెబుతున్నామంటూ వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
టాలీవుడ్తో పాటు పలు సినిమాలలో నటించిన ఆమె సినిమాలకు స్వస్తి చెప్పి, రాజకీయాలకు పరిమితమయ్యారు. మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాను వివాహమాడారు. కాగా, ఆమె అమరావతి నుండి పోటీచేసి ఎంపిగా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అయితే ఈ ఎంపి-ఎమ్మెల్యే జంట ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా చదవుతామంటూ సవాలు చేశారు. ఈ వ్యాఖ్యలు శివసేన నేతల్లో ఆగ్రహ జ్వాలలకు కారణమయ్యాయి
ముఖ్యమంత్రి నివాసం ఎదుట చాలీసా పఠనం ఉపసంహరించుకుంటున్నామని చెబుతూనే ఆదివారం ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కల్గించకూడదన్న ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో శివసేన కార్యకర్తలు సంబంరాలు చేసుకున్నారు.
దీనిపై శివసేన ఎంపి సంజరు రౌత్, మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు వీరిద్దరూ ధాకరే వ్యక్తిగత నివాసం ‘మాతో శ్రీ’ వెలుపల హనుమాన్ చాలీసా పఠించాలని ప్రయత్నిస్తున్నారని ఆర్పించారు. మరొకరి ఆదేశాల మేరకు ఎంపి-ఎమ్మెల్యే జంట ప్రవర్తిస్తున్నారని బిజెపినుద్ధేశించి పాటిల్ పరోక్ష ఆరోపణలు చేశారు.
వీరిద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలని ప్రయత్నిస్తున్నారని, ఉద్ధవ్ నివాసం ఎదుటే హనుమాన్ చాలీసా జపించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. వారి ఇంట్లో కూడా పఠించవచ్చునని పేర్కొన్నారు.
కాగా, శివసేన కార్యకర్తలు ఎంపి-ఎమ్మెల్యే నివాసాలను చుట్టుముట్టడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపి నవనీత్ కౌర్కు విఐపి భద్రత కల్పించింది. నవనీత్కు ముప్పుపొంచి ఉందని కేంద్ర నిఘా సంస్థ కేంద్ర హోం శాఖకు నివేదిక అందజేసింది.
నిఘా సంస్థ సిఫారసులకు ఆమోదం తెలిపిన కేంద్ర హోంశాఖ పారామిలిటరీ సాయుధ కమాండోలతో నవనీత్ కు ‘వై’ కేటగిరీ (సెంట్రల్ కవర్) భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ముగ్గురు నుంచి నలుగురు సీఐఎస్ఎఫ్ కమాండోలు భద్రతా విధుల్లో పాల్గంటారు.