కోల్కతా హైకోర్టులో బుధవారం నాటకీయ సన్నివేశాలు చోటుచేసుకోవడంతో ‘గో బ్యాక్ చిదంబరం’ నినాదాలు మిన్నంటాయి. ఓ కేసులో వాదించడానికి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది పి చిదంబరం వచ్చిన్నప్పుడు నిరసనలు చెలరేగాయి.
అయితే ఈ నిరసనలు చేసింది ప్రతిపక్షాలకు చెందిన వారు కాదు. ఆయన ఎంపీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయవాదులు కావడం గమనార్హం.
కాంగ్రెస్ సెల్ లాయర్లు కొందరు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నల్ల రిబ్బన్లు ప్రదర్శించారు. ”టీఎంసీ సానుభూతిపరుడు” అంటూ వెక్కిరిస్తూ వ్యాఖ్యలు చేయడంతో పాటు పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ పార్టీ దయనీయమైన ఫలితాలను చవిచూడడానికి ఆయనే బాధ్యులంటూ తప్పుపట్టారు.
మెట్రో డెయిరీని తక్కువ ధరకు విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి దాఖలు చేసిన కేసులో ఆయనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చౌకగా వాటాలు అమ్మిన్నల్టు ఆరోపిస్తున్న ఓ ప్రైవేటు కంపెనీ తరపున వాదించడానికి చిదంబరం హైకోర్టుకు వచ్చారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ప్రకారం చిదంబరం తన కారు వైపు వెళుతున్నప్పుడు కాంగ్రెస్ లాయర్లు అతనిపై దూసుకు వస్తూ నిరసన వ్యక్తం చేశారు. కారులో కూర్చొని, ఆందోళనకు గురైన న్యాయవాదులు చిదంబరంను ‘టిఎంసి దలాల్’ , ‘ప్రజల సొమ్ము’ దోచుకున్నారని కూడా నినాదాలు చేశారు.
అధీర్ రంజన్ చౌదరి తరపు న్యాయవాది కౌస్తవ్ బాగ్చితో, పాటు మరో మహిళా న్యాయవాది సుమిత్రా నియోగి నిరసనకు నాయకత్వం వహించి చిదంబరాన్ని ‘మమత పింప్’ (మమతా బ్రోకర్) అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక మీడియా ఛానెల్తో మాట్లాడిన బాగ్చి, “చిదంబరాన్ని నేను కాంగ్రెస్ నాయకుడిగా పరిగణించను, ఈ రోజు మాత్రమే కాదు, ఆయన కలకత్తాకు వచ్చినప్పుడల్లా ‘గో బ్యాక్’ నినాదాన్ని ఎదుర్కొంటారు” అంటూ హెచ్చరించారు. “కేంద్ర మాజీ మంత్రి తన సొంత పార్టీ నాయకుడిపై కేసు పెట్టడానికి ఎందుకు వచ్చాడు? ఈ కేసులో చాలా డబ్బు స్వాహా చేశారని, రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఆయనకు తెలియదా!” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
1991లో స్థాపించిన మెట్రో డెయిరీ అనేది ప్రభుత్వ-ప్రైవేట్ వెంచర్. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పశ్చిమ బెంగాల్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కు 47 శాతం వాటా ఉంది, కేంద్రం ఆధ్వర్యంలోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్ డి డిబి)కి 10 శాతం వాటా ఉంది. మిగిలిన 43 శాతం కెవెంటర్ ఆగ్రో లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది.
ఎన్ డి డి బి తర్వాత తన మొత్తం వాటాను కెవెంటర్కు విక్రయించింది. 2017లో, రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 47 శాతం వాటాను వేలంలో విక్రయించడానికి నిర్ణయించగా, కెవెంటర్ ఒక్కరే వేలంలో పాల్గొని రూ.85 కోట్లతో షేర్లను కొనుగోలు చేశారు.
ఆ తర్వాత, అధీర్ రంజన్ చౌదరి ఒక పిటిషన్ను దాఖలు చేశారు, దీనిలో రాష్ట్ర వాటాలను కెవెంటర్కు చాలా తక్కువ ధరకు విక్రయించడం ద్వారా కనీసం రూ. 500 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కెవెంటర్ తరపున వాదించడానికి చిదంబరం వచ్చారు.
“రాష్ట్ర ప్రభుత్వం తన షేర్లను ఇంత తక్కువ ధరకు ఎందుకు విక్రయించిందో తెలుసుకునే హక్కు బెంగాల్ ప్రజలకు ఉంది. ఈ ధరను ఎవరు నిర్ణయించారు? ఈ డీల్లో ప్రతి స్థాయిలో అవినీతి జరిగింది. నేను తటస్థ ఏజెన్సీచే విచారణ చేయాలని కోరుతున్నాను,” అని చౌదరి డిమాండ్ చేశారు.