మత విద్వేష వ్యాఖ్యలు చేసిన కేసులో బిజెపి ఢిల్లీ అధికార ప్రతినిధి తజిందర్ పాల్ సింగ్ బగ్గా అరెస్టులో శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. ఢిల్లీలోని తజిందర్ నివాసం నుంచి పంజాబ్ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా, హర్యానా, ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.
తజిందర్ను మళ్లీ కొన్ని గంటల వ్యవధిలోనే ఢిల్లీకి ఢిల్లీ పోలీసులు తీసుకెళ్లిపోయారు. మార్చి 30న మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మత విద్వేష వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ప్రకటనలను తజిందర్ పాల్ చేశారు. పంజాబ్లోని ఎస్ఎఎస్ నగర్ జిల్లా మొహాలిలో రాష్ట్ర సైబర్ క్రైమ్ వింగ్ ఏప్రిల్ 1న ఐపిసి సెక్షన్లు 153 ఎ, 505, 505 (2), 506 కింద తజిందర్ పాల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఈ కేసులో ఐదు సార్లు నోటీసులిచ్చినా 36 ఏళ్ల తజిందర్ ఉద్దేశపూర్వకంగానే విచారణకు హాజరుకాలేదని పేర్కొంటూ పంజాబ్ పోలీసులు శుక్రవారం ఉదయం ఢిల్లీలో అరెస్టు చేశారు. ‘చట్టంలోని నిబంధనలను అనుసరిస్తూ నిందితుడిని న్యూఢిల్లీ, జనక్పురిలోని ఉన్న అతని నివాసంలో అరెస్టు చేశాం. చండీగఢ్ తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెడతాం’ అని పంజాబ్ పోలీసులు ఒక ప్రకటన కూడా చేశారు.
తజిందర్పాల్ను తీసుకెళ్తున్న పంజాబ్ పోలీసు వాహనాలను మార్గం మధ్యలో హర్యానా పోలీసులు అడ్డుకోన్నారు. వాహనాలను కురుక్షేత్రలోని పిప్లిలోని పోలీసుస్టేషన్కు తరలించారు. తజిందర్ను బలవంతంగా అతని నివాసం నుంచి తరలిస్తున్నట్లు ఆరోపిస్తూ పంజాబ్ పోలీసు బృందాన్ని కూడా నిర్బంధించారు.
మరోవైపు పిప్లి పోలీసు స్టేషన్కు ఢిల్లీ పోలీసులు కూడా చేరుకున్నారు. తజిందర్ను తమ అదుపులోకి తీసుకున్నారు. తజిందర్ను అపహరించి, దాడి చేశారనే ఆరోపణలతో పంజాబ్ పోలీసులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
దీంతో పంజాబ్, హర్యానా హైకోర్టును పంజాబ్ పోలీసులు ఆశ్రయించారు. వెంటనే, ఏమి జరిగిందో వివరిస్తూ అఫిడవిట్ లను దాఖలు చేయమని హైకోర్టు ఢిల్లీ, హర్యానా పోలీసులను ఆదేశించింది. కేసును శనివారంకు వాయిదా వేసింది.
పంజాబ్లో ఆప్ ప్రభుత్వం, హర్యానాలో బిజెపి ప్రభుత్వం ఉంది. ఢిల్లీ పోలీసులు కూడా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటారు. నాటకీయంగా జరిగిన ఈ పరిణామాలలో బీజేపీ- ఆప్ ల మధ్య నెలకొన్న రాజకీయ వైరుధ్యాలలో మూడు రాష్ట్రాల పోలీసులు పాల్గొన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై విమర్శలు గుప్పించిన తమ నాయకుడిని పంజాబ్ పోలీసులు “అపహరించారని”, పంజాబ్ పోలీసుల ద్వారా ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీకి ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ అభియోగాన్ని తోసిపుచ్చుతూ పంజాబ్లో మతపరమైన ఉద్రిక్తతను రేకెత్తించినందుకు ఢిల్లీ బిజెపి ప్రతినిధిని అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది.
బగ్గా తండ్రి ప్రీత్పాల్ సింగ్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు పంజాబ్ పోలీసులపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో 15-20 మంది పంజాబ్ పోలీసు సిబ్బంది తమ జనక్పురి ఇంటిలోకి చొరబడి, తన ముఖంపై కొట్టి, తన కొడుకును తలపాగా ధరించడానికి కూడా అనుమతించకుండా అరెస్ట్ చేసి తీసుకు వెళ్లారని ప్రీత్పాల్ సింగ్ ఆరోపించారు.
“తొలుత ఇద్దరు పంజాబ్ పోలీసులు రాగా మేము వారికి టీ ఇచ్చాము. కొన్ని నిమిషాల తర్వాత, 10-15 మంది పంజాబ్ పోలీసులు లోపలికి ప్రవేశించారు. వారు తజిందర్ను బయటకు లాగారు. అతనిని తల పాగా ధరించడానికి కూడా అనుమతించలేదు. నేను సంఘటనను వీడియో చేయడానికి ప్రయత్నించగా నా మొబైల్ ఫోన్ లాక్ చేసి, నన్ను ముఖంపై కొట్టి, బలవంతంగా కూర్చోబెట్టారు” అని బగ్గా వృద్ధ తండ్రి విలేకరులతో చెప్పారు.
వెంటనే, బగ్గాతో కూడిన వాహనాల అశ్వదళం ఢిల్లీ నుండి 250 కిమీ దూరంలో గల పంజాబ్లోని మొహాలీకి బయలుదేరింది. ఆ రెండు నగరాల మధ్య సగం దూరంలో హర్యానాలోని కురుక్షేత్ర ఉంది. అక్కడ హర్యానా పోలీసులు వారిని ఆపివేశారు.
పంజాబ్ పోలీసు బృందాన్ని ఎందుకు ఆపారని అడగగా, బగ్గాను అతని ఇంటి నుండి `బలవంతంగా ఎత్తుకెళ్లిన్నట్లు తమకు సమాచారం ఉందని హర్యానా పోలీసు అధికారి చెప్పారు. ఆ తర్వాత జరిగిన హై-వోల్టేజ్ డ్రామాలో, ఢిల్లీ పోలీసు బృందం కురుక్షేత్రకు చేరుకుని పంజాబ్ పోలీసుల నుండి 36 ఏళ్ల బగ్గాను అదుపులోకి తీసుకుంది.
బగ్గా అరెస్టుకు ఖచ్చితమైన కారణాలు, చట్టబద్ధత స్పష్టంగా లేవు. బగ్గాను అరెస్టు చేయడానికి ముందు పంజాబ్ పోలీసులు ఢిల్లీలోని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వలేదని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు స్పష్టం చేశారు.
మొహాలీకి చెందిన ఆప్ నేత సన్నీ అహ్లువాలియా ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇలా ఉండగా, బగ్గాను ఢిల్లీలో అరెస్టు చేయడంపై పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ అనూహ్యంగా బీజేపీ వాదనకు బలం చేకూర్చే విధంగా వ్యాఖ్యానించారు.
బగ్గా అరెస్టును ”రాజకీయ ప్రతీకార చర్య”గా సిద్ధూ అభివర్ణించారు. ఇందుకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీని, ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను ఆయన తప్పుపట్టారు.
‘తజిందర్ బగ్గా వేరే పార్టీకి చెందిన వ్యక్తి. ప్రతి ఒక్కరికీ సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. అయితే, వ్యక్తిగత విభేదాల పరిష్కారానికి పంజాబ్ పోలీసులను ఉపయోగించుకుని అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్లు ప్రతీకార రాజకీయాలకు పాల్పడటం చాలా పాపం. ఈ విషయాన్ని రాజకీయం చేయడం ద్వారా పంజాబ్ పోలీసుల ప్రతిష్టను దిగజార్చడం ఆపండి” అని సిద్ధూ ట్వీట్ చేశారు.