ఒక వంక తీవ్రమైన అవినీతి ఆరోపణలు, మరో వంక శృతి మించిన అంతర్గత కుమ్ములాటలతో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కర్ణాటకలో తిరిగి అధికారంలోకి రావడం ప్రశ్నార్ధకరంగా మారడంతో, ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఉనికిని ప్రశ్నించే విధంగా ఆ పార్టీ కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గాలం వేస్తున్నట్లు తెలుస్తున్నది.
ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న సిద్దరామయ్య పరోక్ష సహకారంతోనే కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన హెచ్ డి కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోసి రెండున్నరేళ్ల క్రితం బిజెపి అధికారంలోకి రాగలిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కలేదని అసమ్మతితో బీజేపీలో చేరిన వారంతా సిద్దరామయ్య మద్దతుదారులు కావడం గమనార్హం.
ప్రస్తుతం బసవరాజ్ బొమ్మై మంత్రివర్గంలో కనీసం 15 మంది సిద్దరామయ్య మద్దతుదారులుగా భావిస్తున్నారు. ఈ విషయమై బిజెపి నేతలు సిద్దరామయ్యతో మంతనాలు జరిపారని, తన మద్దతు దారులకు కనీసం 20 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారని రాజకీయ వర్గాలలో వినవస్తుంది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ సొంతబలంతో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ ప్రాబల్యం లేని పాత మైసూరు ప్రాంతంలో పట్టు సాధించేందుకు అక్కడి నేతలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మాజీ సీఎం సిద్ధరామయ్యను బీజేపీలో చేర్చుకునేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.
పాత మైసూరు ప్రాంతంలో మొత్తం 89 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 10 చోట్ల మాత్రమే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. మరి కొన్ని రోజుల్లో మాజీ సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్కు గుడ్బై చెప్పి బీజేపీలో చేరుతారని రాష్ట్ర మంత్రి ఆర్.మునిరత్న గతవారం జోస్యం చెప్పడం గమనార్హం. వచ్చే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాభవం తప్పదని ఆయన జోస్యం చెప్పారు.
గతంలో జేడీఎస్ లో కీలక నేతగా ఉన్న సిద్దరామయ్య మాజీ ప్రధాని దేవెగౌడ తర్వాత తానే ముఖ్యమంత్రి కాగలనని ఆశించారు. అయితే కుమారుడు హెచ్ డి కుమారస్వామి కావడంతో, ఇక ఆ పార్టీలో తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని గ్రహించి కాంగ్రెస్ లో చేరి, అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. అయినా కాంగ్రెస్ నేతలతో అయన సఖ్యతతో ఉండలేక పోయారు. ముఖ్యమంత్రిగా గతంలో తనతోపాటు జేడీఎస్ లో నుండి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తూండేవారని విమర్శలు ఉండేవి.
ప్రస్తుతం పుష్కలంగా వనరులు గల డి కె శివకుమార్ ను ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయడంతో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తనకు మరోమారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని సిద్దరామయ్య గ్రహించారు. బీజేపీలో చేరితే ముఖ్యమంత్రి కాలేక పోయినా కేంద్ర మంత్రి కావచ్చనే అంచనాతో పార్టీ మార్పుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది.