ఢిల్లీలోని జహంగీర్పురిలో శ్రీరామనవమి రోజున అలర్లను నియంత్రించడంలో పోలీసులు పూర్తిస్థాయిలో విఫలమయ్యారని ఢిల్లీలోని రోహిణి జిల్లా కోర్టు తీవ్రంగా విమర్శించింది. శ్రీరామనవమి సందర్భంగా పోలీసు అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా జరిగిన ఊరేగింపును నిలిపివేయడానికి బదులుగా, దానిని పోలీసులు అనుసరించారని పేర్కొంది.
ఈ కేసులో ఎనిమిదిమంది నిందితులకు బెయిల్ను తిరస్కరించింది. నిందితులు స్థానికంగా పేరుగాంచిన నేరస్థులని, వారిని విడుదల చేస్తే సాక్షులను భయపెట్టే అవకాశం ఉంటుందని కోర్టు పేర్కొంది. జహంగీర్పురి ప్రాంతంలో శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా జరిగిన అల్లర్లలో ఎనిమిదిమంది పోలీసులు, ఒక పౌరుడు గాయపడ్డారు. 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసు విచారణలో ఎఫ్ఐఆర్ ప్రకారం పోలీసుల అనుమతి లేకుండానే ఊరేగింపు జరిగిందని, పోలీసుల సమక్షంలోనే మైనారిటీలతో వాగ్వివాదం, ఘర్షణలు జరిగాయని తెలుస్తోందని కోర్టు పేర్కొంది. చట్టవిరుద్ధమైన ఊరేగింపును నిలిపివేసి, గుంపును చెదరగొట్టడానికి బదులుగా, పోలీసు అధికారులు ఊరేగింపుతో పాటు వెళ్లారని కోర్టు విమర్శించింది.
శాంతిభద్రతలను రక్షించడం పోలీసుల బాధ్యత అని, పరిస్థితి సున్నితంగా ఉంటే అది మరింత దిగజారకుండా చూడాలని కోర్టు స్పష్టం చేసింది. ‘జహంగీర్పురి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజీవ్ రంజన్తో సహా స్థానిక సిబ్బంది, ఇతర అధికారులు ఊరేగింపుతోపాటు ఉన్నారని ఎఫ్ఐఆర్లోని విషయాలు నిర్థారిస్తున్నాయి’ అని న్యాయమూర్తి చెప్పారు.
అనుమతి లేకుండా జరుగుతున్న ఊరేగింపును ఆపడంలో స్థానిక పోలీసుల పూర్తి వైఫల్యాన్ని ఇది ప్రాథమికంగా ప్రతిబింబిస్తుందని, ఈ విషయాన్ని సీనియర్ అధికారులు పక్కన పెట్టినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, చట్టవిరుద్ధ కార్యక్రమాల నియంత్రణలో పోలీసులు విఫలం కాకుండా ఉండేందుకు దోషులైన అధికారులను బాధ్యులను చేయాలని న్యాయమూర్తి తెలిపారు.
ఈ అంశంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని పోలీస్ చీఫ్ను ఆదేశించారు. ఈ అంశంపై ఢిల్లీ పోలీసు శాఖ సీనియర్ అధికారి దీపేంద్ర పాఠక్ స్పందిస్తూ తాము సాధ్యమైనంత తక్కువ సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.