రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుల పదవీ కాలం వరుసగా జులై, ఆగష్టు నెలల్లో పూర్తి కావస్తునందున ఆ పదవులకు ఎన్నికలు జరుగబోతున్నాయి. బిజెపి మొదటిసారిగా ఈ రెండు అత్యున్నత రాజ్యాంగ పదవులకు తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను ఎన్నిక చేసుకోగలిగింది. గతంలో వాజపేయి హయాంలో ఉపరాష్ట్రపతిగా బైరంగసింగ్ షెకావత్ ఎన్నికైనా, రాష్ట్రపతిగా ఎన్నికైన అబ్దుల్ కలాం బిజెపి సభ్యుడు కారు.
ఈ పర్యాయం కూడా ఈ రెండు పదవులకు తమ పార్టీ అభ్యర్థులను ఎన్నికయ్యేటట్లు చూడడం కోసం బిజెపి కసరత్తు ప్రారంభించింది. ఈ విషయమై ముందుగా ఎన్డీయే భాగస్వాములతో సమాలోచనలు జరపడంతో పాటు, తటస్థంగా ఉన్న పార్టీ నేతల వద్దకు కేంద్ర మంత్రులను పంపనున్నారు. మొదటగా, ఎన్డీయే భాగస్వామి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదేశ్ పాట్నా వెళ్లి కలిశారు.
బీహార్ లో తమకే ఎక్కువమంది ఎమ్యెల్యేలు ఉండడంతో నితీష్ కుమార్ ను ఉపరాష్ట్రపతిగా పంపి, ముఖ్యమంత్రి పదవిని తమ పార్టీ వ్యక్తికి అప్పచెప్పాలని బీజేపీలో ఓ వర్గం అంటూ ఉండడంతో అక్కడ బిజెపి, జేడీయుల మధ్య ఈ మధ్యకాలంలో దూరం పెరుగుతూ వచ్చింది. అటువంటి సమయంలో రాష్ట్ర నాయకులకు తెలుపకుండానే ధర్మేంద్ర ప్రధాన వచ్చి నేరుగా నితీష్ ను కలవడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది.
‘కేంద్ర మంత్రి ప్రధాన్ దాదాపు రెండు గంటలపాటు సిఎంతో భేటీ అయిన విషయం రాష్ట్ర బిజెపికి కూడా సమాచారం లేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మద్దతును కోరేందుకు భాగస్వామ్య, స్నేహపూర్వకంగా ఉండే సిఎంలను కలవడం బిజెపి ప్రయత్నాలలో భాగమని మాకు తెలిసింది’ అని బీహార్ బిజెపికి చెందిన ఓ నేత చెప్పారు.
గతంలో ప్రత్యర్థి పార్టీల తరపున పోటీ చేసిన రాష్ట్రపతి అభ్యర్థులకు నితీష్ మద్దతు పలకడం గమనార్హం. 2012లో నితీష్ ఎన్డిఎలో భాగమైనప్పటికీ, రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపక్షానికి చెందిన ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చారు. 2017లో ఆయన ఆర్జెడి, కాంగ్రెస్తో కలిసి మహాకూటమిలో ఉన్నప్పుడు ప్రతిపక్ష అభ్యర్థి మీరా కుమార్కు బదులుగా ఎన్డిఎ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో ఆయన బీహార్ గవర్నర్ గా ఉండడమే కారణం.
ఒడిశా, ఆంధ్రాలో అధికార పార్టీలు బిజెడి, వైసిపిలు బిజెపి అభ్యర్థులకు ఓటు వేయడానికి మొగ్గు చూపుతున్నాయని భావిస్తున్నారు. ఆ రెండు పార్టీలు మద్దతు ఇస్తే బిజెపి అభ్యర్థులు సునాయానంగా గెలుపొందగలరు. కేంద్ర సీనియర్ మంత్రులు త్వరలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్ లను కూడా ఈ విషయమై కలిసే అవకాశం ఉంది.
ప్రస్తుత పరిస్థితులలో జగన్ మోహన్ రెడ్డి మద్దతుపై బీజేపీలో ఎటువంటి సందేహం లేకపోయినప్పటికీ నవీన్ పట్నాయక్ మద్దతు ఇవ్వని పక్షంలో బిజెపి ప్రతిపక్షాల ఓట్లను చీల్చేందుకు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ మద్దతు కోరే అవకాశం ఉంది. తరచూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్న గవర్నర్ రవి తన ప్రవర్తన సరిదిద్దుకొంటే రాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు ఇవ్వడానికి స్టాలిన్ సుముఖంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక గత ఎన్నికలలో మద్దతు ఇచ్చిన శివసేన ఈ పర్యాయం ప్రతిపక్షాల అభ్యర్ధికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అయితే పంజాబ్, ఢిల్లీలో గణనీయ ఓట్లు గల ఆప్ వైఖరి అంతుబట్టడం లేదు. గత పర్యాయం కాంగ్రెస్ అభ్యర్ధికి కాకుండా, బిజెపి అభ్యర్హ్డికి మద్దతు ఇవ్వడం గమనార్హం.
అదే విధంగా గత పర్యాయం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కోరడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహితం బిజెపి అభ్యర్ధికి మద్దతు ఇచ్చారు. ఈ పర్యాయం ఆయన వైఖరి సహితం కీలకం కానుంది.