హనుమాన్ చాలీసా చాలెంజ్తో జైలుపాలై బెయిల్ మీద విడుదలైన ఎంపీ నవనీత్ కౌర్, ఆమె ఎమ్యెల్యే భర్త రవి రానాలకు మళ్లీ జైలుకు వెళ్ళక తప్పదా? పిఈ జంటకు బెయిల్ రద్దు చేయాలంటూ ముంబై పోలీసులు సోమవారం స్పెషల్ కోర్టును ఆశ్రయించడంతో వారికి మరోమారు చిక్కులు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ప్రత్యేక న్యాయస్థానం. అయితే.. షరతుల్లో ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దన్న కూడా స్పష్టం చేసింది. ఒకవేళ మాట్లాడితే గనుక బెయిల్ దానంతట అదే రద్దు అయిపోతుందని హెచ్చరించింది కూడా.
ఈ నేపథ్యంలో వాళ్లు మీడియాతో మాట్లాడినందుకుగానూ బెయిల్ రద్దు చేయాలని, అంతేకాదు వాళ్లమీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు తమ అభ్యర్థన పిటిషన్లో ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ముంబై పోలీసుల దరఖాస్తుపై స్పందించాలంటూ నవనీత్ కౌర్ దంపతులకు నోటీసులు జారీ చేసింది.
హనుమాన్ చాలీసా ఛాలెంజ్తో ముఖ్యమంత్రి ఉద్ధవ్సీ థాక్రేకు ఎదురెళ్లిన ఈ ఇండిపెండెంట్ ప్రజా ప్రతినిధుల జంట.. రెచ్చగొట్టే చర్యల మీద అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. అయితే వీళ్ల బెయిల్ను సవాల్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం అనుకుంది.
ఈ లోపు ఢిల్లీలో ఈ జంట వరుసబెట్టి ప్రెస్ మీట్లు పెడుతోంది. పైగా సీఎం ఉద్దవ్ థాక్రేకు చాలెంజ్లు విసిరింది. జైలు నుండి విడుదలయ్యాక అమరావతి ఎంపీ అయిన నవనీత్ కౌర్ రాణా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను మరోసారి లక్ష్యంగా చేసుకొంటూ దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేసి నెగ్గాలని ఆయనకు ఆదివారం సవాలు విసిరారు.
‘‘ఉద్ధవ్ను ఆయనకు నచ్చిన చోటునుంచి పోటీ చేయమనండి. ఆయనపై నేను తలపడతాను. అప్పుడే ప్రజల పవర్ ఏంటో ఆయనకు తెలుస్తుంది’’ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. మీడియాతో మాట్లాడడమే కాకుండా మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నందుకుగానూ బెయిల్ రద్దు చేయాలంటూ ఖర్ పోలీస్ స్టేషన్ ఎస్సై స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘారత్ ద్వారా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
ఈ జంట ప్రెస్ మీట్లకు సంబంధించిన వీడియోలను కోర్టు సైతం పరిశీలించినట్లు సమాచారం. దీంతో నవనీత్ కౌర్, ఆమె భర్త గనుక సరైన వివరణ ఇవ్వకుంటే మాత్రం వెంటనే అరెస్ట్ దిశగా కోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మరోవంక, మహారాష్ట్ర పోలీసులు తమ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఎంపీ నవనీత్ రాణా సోమవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఒక కేసులో తనతో పాటు, ఎమ్మెల్యే అయిన భర్త రవి రాణాను అరెస్టు చేసిన పోలీసులు లాక్పలోనూ, జైలులోనూ అమర్యాదకరంగా వ్యవహరించారని తెలిపారు. క్రిమినల్స్ కన్నా హీనంగా చూశారని అంతకుముందు ముంబైలో జరిగిన మీడియా సమావేశంలోనూ ఆరోపించారు.
ఈ నెల 23న తన ఫిర్యాదును లోక్సభ హక్కుల కమిటీ పరిశీలిస్తుందని, తాను లిఖితపూర్వక స్టేట్మెంట్ సమర్పిస్తానని ఆమె చెప్పారు. ఆమె అరెస్టుపై వాస్తవాలు పంపించాలని ఇప్పటికే లోక్సభ కార్యాలయం కేంద్ర హోం శాఖ ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి కూడా ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు.