కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనీ స్థానిక రైతులను బహిష్కరిస్తామంటూ బెదిరించే ప్రకటనలు చేయకపోతే నలుగురు రైతులతో సహా ఎనిమిదిమంది గత అక్టోబర్లో లఖింపూర్ ఖేరీలో ప్రాణాలు కోల్పోయే ఘటన జరిగేది కాదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది.
2021 అక్టోబర్ 3న టికోనియాలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టును హత్యకు గురయిన కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా (మంత్రి కుమారుడు), నలుగురు సహ నిందితులు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
నలుగురు నిందితులు సుమిత్ జైస్వాల్, అంకిత్ దాస్, శిష్పాల్, లవకుష్లలో ప్రతి ఒక్కరిపై సాక్ష్యాలున్నాయని కోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబూ బనారసీ దాస్ మనవడు అంకిత్ దాస్ బెయిల్ దరఖాస్తును తిరస్కరిస్తూ జస్టిస్ దినేష్ కుమార్ సింగ్ ఇలా వ్యాఖ్యానించారు:
”ఉన్నత పదవుల్లో ఉన్న రాజకీయ వ్యక్తులు సమాజంలోని పరిణామాలను పరిగణనలోకి తీసుకుని బహిరంగంగా మంచి భాషలో మాట్లాడాలి. వారు బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేయకూడదు. ఎందుకంటే వారు తమ హోదాకు, వారు నిర్వహించే అత్యున్నత పదవికి తగినట్లుగా వ్యవహరించాలి” అని పేర్కొన్నారు.
విచారణ సంస్థ తరపున దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్న విధంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బెదిరింపులకు దిగకుంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని కోర్టు పేర్కొంది. జస్టిస్ సింగ్ ఇలా అన్నారు: ‘చాలా మంది అమాయకుల జీవితాలు అత్యంత క్రూరమైన, దౌర్జన్య, అనాగరిక, భయంకరమైన, అమానవీయ పద్ధతిలో అతని కొడుకు, ఇతర నిందితులు వల్ల కోల్పోయారు”.
అక్టోబరు 3న కేంద్ర మంత్రి తన పూర్వీకుల గ్రామమైన బన్వీర్పూర్లో కుస్తీ పోటీని నిర్వహించిన రోజు రైతుల నిరసన జరిగింది. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ను విధించినప్పుడు, కుస్తీ పోటీలను ఎందుకు రద్దు చేయలేదని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
”చట్టాన్ని రూపొందించే వారిని చట్టాన్ని ఉల్లంఘించే వారిగా చూడలేము. ఆ ప్రాంతంలో సెక్షన్ 144 నిబంధనలు విధించినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (కేశవ్ ప్రసాద్ మౌర్య)కి తెలియదని ఈ న్యాయస్థానం నుంచి నమ్మలేం. అన్ని సమావేశాలు నిషేధంలో ఉంటాయి. అయినప్పటికీ, రెజ్లింగ్ పోటీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరు కావాలని నిర్ణయించారు” అని కోర్టు విమర్శించింది.