జమ్మూ కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ (56) ఉగ్రవాదులకు నిధులు అందించిన కేసులో ఢిల్లీలోని పటియాల హౌస్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. భారీ భద్రత నడుమ మాలిక్ ను బుధవారం మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి తుది తీర్పును వెలువరించారు. ఎన్ఐఏ మరణ శిక్ష విధించాలని వాదించగా ధర్మాసనం యావజ్జీవ శిక్ష విధించింది.
ఈనెల 19నే మాలిక్ ను దోషిగా తేల్చిన కోర్టు తాజాగా బుధవారం సాయంత్రం ఈ మేరకు శిక్షను విధిస్తూ తీర్పును ఇచ్చింది. టెర్రర్ ఫండింగ్ కేసులో తనపై నమోదైన అన్ని అభియోగాలను యాసిన్మాలిక్ అంగీకరించాడు. వాటిని కోర్టులో సవాలు చేయడానికి కూడా నిరాకరించాడు. దీంతో ఎన్ఐఏ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది.
1989లో జరిగిన కశ్మీరీ పండిట్ల హత్యల్లోనూ జేకేఎల్ఎఫ్ నాయకుల పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. వీరి దురాగతాలతో కశ్మీర్ నుంచి భారీ సంఖ్యలో పండిట్లు వలస వెళ్లారు.1984లో జరిగిన భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే హత్య ఘటనతోనూ జేకేఎల్ఎఫ్ కు సంబంధాలు ఉన్నాయి.
యాసిన్ పై ఉపా సెక్షన్ 120-బి లోని సెక్షన్లు 16 (ఉగ్రవాద కార్యకలాపాలు), 17 (ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సేకరించడం), 18 (ఉగ్రవాద చర్యలకు కుట్ర), మరియు 20 (ఉగ్రవాద సమూహం లేదా సంస్థలో సభ్యుడు కావడం) కింద అభియోగాలు నమోదయ్యాయి. భారతీయ శిక్షాస్మృతిలో (నేరపూరిత కుట్ర), 124-A (దేశద్రోహం) కూడా అభియోగాలను అతడు ఎదుర్కొంటున్నాడు.
- 2017లో యాసిన్ మాలిక్ తో పాటు మరో నలుగురు కశ్మీర్ వేర్పాటువాద నేతలపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. అతడు ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేస్తున్నాడని ఎన్ఐఏ ఆరోపించింది.
- ఎన్ఐఏ కేసుకు సంబంధించిన చార్జిషీట్ 2019లో దాఖలైంది.
- 2019 ఫిబ్రవరి 26న యాసిన్ మాలిక్ ఇంట్లో ఎన్ఐఏ బృందాలు సోదాలు నిర్వహించాయి.
- 2019 ఏప్రిల్ 10న యాసిన్ మాలిక్ ను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
- 2022 మార్చి 16న లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ సహా పలువురు వేర్పాటువాద నేతలపై కూడా చార్జిషీట్ దాఖలు చేయాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. దీనికి అనుగుణంగా ఎన్ఐఏ వారిపైనా చార్జిషీట్లను దాఖలు చేసింది.
- 2022 మే 19న ఎన్ఐఏ కోర్టు యాసిన్ మాలిక్ ను దోషిగా తేల్చింది. ఉగ్రవాదులకు అతడు నిధులు అందించిన మాట వాస్తమేనని స్పష్టంచేసింది. ఈ కేసులో శిక్షను మే 25న ఖరారు చేస్తామని వెల్లడించింది.