మహారాష్ట్ర నుండి రాజ్యసభకు ఆరుగురు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా, ఏకగ్రీవ ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష నేతల మధ్య జరిగిన సమాలోచనలు విఫలం కావడంతో 24 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నెల 10న జరుగనున్న ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారంతో గడువు ముగిసింది.
రాజ్యసభకు అభ్యర్ధులను మూజువాణి ఓటు పద్ధతిలో ఎన్నుకోవాలని చట్టం రూపొందించిన తరువాత ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. 1998లో రాజ్యసభ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరిగాయి. ఇప్పుడు ఏకంగా 24 ఏళ్ల తరువాత మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి.
శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఎన్నికల కమిషన్ గడువు విధించింది. ఆలోపు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు మహావికాస్ ఆఘాడి సీనియర్ నేతలు ఛగన్ భుజబల్, సునీల్ కేదార్ తదితరులు ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్ నివాసమైన సాగర్ బంగ్లాలో చర్చలు జరిపారు. అయినప్పటికీ బీజేపీ, శివసేన నామినేషన్లు ఉపసంహరించుకోక పోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్ధానాలున్నాయి. అందులో ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన ముంబైలోని తూర్పు అంధేరీ నియోజక వర్గం శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే గుండెపోటుతో అక్కడే మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది.
బీజేపీ, శివసేన ఇద్దరు చొప్పున, కాంగ్రెస్, ఎన్సీపీ ఒక్కొక్కరు చొప్పున ఇలా ఆరుగురు సభ్యులు నామినేషన్లు వేయాల్సి ఉంది. కానీ అసెంబ్లీలో తమకు సంఖ్యా బలం ఎక్కువ ఉందని భావించిన బీజేపీ మూడో అభ్యర్ధిని బరిలో దింపింది. కేవలం 11–12 ఓట్లు తక్కువవుతున్నాయి.
ఎలాగైనా ఆ ఓట్లను రాబట్టుకుని మూడో అభ్యర్ధిని గెలిపించుకుంటామని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో ఓట్ల కొనుగోలుపై భారీగా ఆర్ధిక లావాదేవీలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోకుండా మహావికాస్ ఆఘాడి ప్రభుత్వానికి చెందిన మంత్రులు, నేతలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మహావికాస్ ఆఘాడి ప్రభుత్వంలో మిత్రపక్షాలైన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలందరినీ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ముంబైలోని ఓ రహస్య ప్రాంతంలో ఒకే చోట ఉంచనున్నారు. ఓట్లు చీలిపోకుండా, బేరమాడకుండా సెల్ఫోన్లో జరిగే సంభాషణలపై కూడా దృష్టిసారించనున్నారు. ఆరో అభ్యర్ధిని గెలిపించుకునేందుకు బీజేపీ, శివసేన తమ ప్రతిష్టను ఫణంగా పెట్టి ప్రయత్నం చేస్తున్నాయి.
రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్ధానాలుండగా అందులో బీజేపీ–106, శివసేన–55, ఎన్సీపీ–54, కాంగ్రెస్–44 మొత్తం 259 ఎమ్మెల్యేలున్నారు. మిగతా చిన్న చితకా పార్టీలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, 13 మంది ఇండిపెండెంట్లు ఇలా 29 మందితో కలిసి మొత్తం 288 మంది ఉన్నారు.
ఇందులో బహుజన్ వికాస్ ఆఘాడి–3, ఎంఐఎం–2, సమాజ్వాది పార్టీ–2, ప్రహార్ జనశక్తి పార్టీ–2, ఎమ్మెన్నెస్–1, ఆర్ఎస్పీ–1, క్రాంతికారి శేత్కరీ పార్టీ–1, జన సురాజ్య పార్టీ–1, కమ్యూనిస్టు పార్టీ–1, శేత్కరి కామ్గార్ పార్టీ–1, సీపీఐ (ఎం)–1 ఇలా మొత్తం 16 చిన్నాచితకా పార్టీల ఎమ్మెల్యేలున్నారు. వీరంతా ఎవరికి మద్దతునిస్తారన్న దానిపై రాజ్యసభ సభ్యుల భవిత ఆధారపడి ఉంది.
కాగా, రాజ్యసభ ఎన్నికల తమ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం చిన్న పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేయాలనుకుంటోందని, ఈ క్రమంలో వారిపై ఒత్తిడి తెస్తోందని శివసేన నేత సంజయ్రౌత్ ఆరోపించారు.
‘మూడో అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీజేపీ రాజ్యసభ ఎన్నికలలో అనైతికంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. వారికి మూడో అభ్యర్థిని గెలిపించుకునే బలం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. దానికోసం ఆ పార్టీ స్వతంత్ర ఎమ్మెల్యేలు, చిన్న పార్టీలపై ఆధారపడుతోంది. ఓట్లకోసం వారిపై ఒత్తిడి తెస్తోందని మాకు మొత్తం సమాచారం అందుతోంది’ అని రౌత్ విమర్శించారు.