గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండే సరికి గత ఎన్నికలలో బిజెపిని దాదాపు పరాజయం అంచుకు తీసుకెళ్లి, పెద్ద షాక్ ఇచ్చిన పటీదార్లు తిరిగి ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగా పావులు కదపడం ప్రారంభించారు. అప్పటి పాటీదార్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ను కాంగ్రెస్ నుండి బీజేపీలో చేర్చుకున్నప్పటికీ వారిలో బిజెపి పట్ల ఏర్పడిన వైమాష్యం పూర్తిగా తొలిగిన్నట్లు కనిపించడం లేదు.
ఈ సారి, సర్దార్ పటేల్ స్టేడియం (మొతెరా క్రికెట్ స్టేడియం)కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టడంపై పాటిదార్లు ఆగ్రవేశాలు వ్యక్తం చేయడం ద్వారా బిజెపికి వ్యతిరేకంగా సమీకృతమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్టేడియానికి తిరిగి సర్దార్ పటేల్ పేరునే పెట్టాలని డిమాండ్ ను తెరపైకి తీసుకొస్తున్నారు.
ప్రధాని మోదీని గౌరవిస్తామని, అయితే ఈ స్టేడియంకు గతంలో ఉన్న పేరును మార్చకూడదని చెప్తున్నారు.
ఇదే డిమాండ్తో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ప్రపంచంలోని అతి పెద్ద స్టేడియంలలో ఈ స్టేడియం ఒకటి. ఈ స్టేడియం పేరు మార్చాలని పాటిదార్లు ఓ సమితిని ఏర్పాటు చేశారు.
సర్దార్ సన్మాన్ సంకల్ప్ ఆందోళన్ సమితి పేరుతో వివిధ సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. 2015లో పాటిదార్ రిజర్వేషన్ల కోసం ఆందోళన కార్యక్రమాలను నిర్వహించిన పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి కూడా దీనికి మద్దతు పలుకుతోంది.
ఈ సంఘాలన్నీ కలిసి ఆదివారం బర్డోలీ సూరత్లోని స్వరాజ్ ఆశ్రమం నుంచి ప్రదర్శనను ప్రారంభిస్తాయి. సోమవారం సాయంత్రం ఈ స్టేడియం గేట్ నెం.1 వద్ద పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనను నిర్వహిస్తాయి.
ఈ గ్రూప్ కన్వీనర్ అతుల్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ స్టేడియం పేరును మార్చకపోతే తాము తమ నిరసనలను తీవ్రం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని నిర్మించారని, ఎన్నికలు పూర్తయిన తర్వాత స్టేడియం పేరును మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పేరును దుర్వినియోగం చేయడానికి ఈ ప్రభుత్వాన్ని అనుమతించబోమని హెచ్చరించారు. సర్దార్ పటేల్ను తిరిగి గౌరవించాలని డిమాండ్ చేశారు. సర్దార్ పటేల్ స్టేడియంను అభివృద్ధిపరచిన తర్వాత దానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టారని ధ్వజమెత్తారు.