సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం పక్కా పథకం ప్రకారం జరిగినదేనని స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుండే విధ్వంస కుట్ర జరిగిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఈ విధ్వంసం వెనుక సీఎం స్ట్రాటజిస్టు పథక రచన ఉందని ధ్వజమెత్తారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శక్తి కేంద్ర ఇంఛార్జీల సమావేశంలో మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రాష్ట్ర పోలీసులే కాల్పులు జరిపారని, అయినా కేంద్రాన్ని బదనాం చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. పోలీసుల కాల్పుల్లో మంత్రి చెందిన రాకేశ్ అంతిమ యాత్ర పేరుతో వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ నేతలు విధ్వంసం స్రుష్టించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేస్తుండటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్మీ అభ్యర్థులతో పాటు ప్రజలంతా వాస్తవాలు గమనించి కుట్రలను చేధించాలని ఆయన కోరారు. తెలంగాణలో విచిత్రమైన పరిస్థతి నెలకొన్నదని చెబుతూ బీజేపీ వారిని పదేపదే అరెస్ట్ చేస్తారని, కాంగ్రెస్ ను మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తారని విస్మయం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లో తడాఖా చూపిస్తామని ముందే కాంగ్రెసోళ్లు హెచ్చరించి ‘చలో రాజ్ భవన్ ’ పేరుతో విధ్వంసం స్రుష్టించారని గుర్తు చేశారు. . పోలీసులకు సమాచారం ఉన్నా ముందస్తుగా అరెస్ట్ చేయరని ఎద్దేవా చేశారు. బీజేపీ గ్రాఫ్ పెరిగింది కాబట్టి.. బీజేపీని డామేజ్ చేసి కాంగ్రెస్ గ్రాఫ్ పెంచాలని సీఎం కేసీఆర్ నీచమైన కుట్రకు తెరదీసిండని విమర్శించారు.
అగ్నిపథ్ ఒక గొప్ప పథకం అంటూ 17.5 సంవత్సరాల నుండి 23 ఏళ్ల వయసున్న యువకులను ఆర్మీలో చేర్చుకునేందుకు దీనిని ప్రవేశపెట్టారని చెప్పారు. గతంలో వెయ్యి మంది దరఖాస్తు చేసుకుంటే కొద్ది మందిని మాత్రమే సెలెక్ట్ చేసేవాళ్లని, కానీ ఇకపై దరఖాస్తు చేసుకున్న వారందరినీ దాదాపు అగ్నివీరులుగా గుర్తించి 6 నెలల పాటు శిక్షణ ఇస్తారని సంజయ్ వెల్లడించారు.
తొలి ఏడాది రూ 30 వేల నుండి జీతం మొదలవుతుందని, నాలుగేళ్లపాటు అగ్నివీరులుగా కొనసాగే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే జీతంలో 70 శాతం నగదు అగ్ని వీరులకు అందజేస్తారని, మిగిలిన మొత్తం కార్పస్ ఫండ్ కు జమ అవుతుందని చెప్పారు.
నాలుగేళ్ల తరువాత వంద మందిలో 25 శాతం మందిని సెలెక్ట్ చేసి ఆర్మీలో చేర్చుకుంటారని, మిగిలిన వాళ్లకు కార్పస్ ఫండ్ పేరిట రూ 5 లక్షలతో పాటు కేంద్రం మరో రూ 5 లక్షలు, మరో లక్ష వడ్డీ కలిపి మొత్తం రూ 11 లక్షలను అందజేస్తారని వివరించారు. అట్లాగే ఇకపై జరిగే ఆర్మీ రిక్రూట్ మెంట్ లో అగ్ని వీరులకు 10 శాతం రిజర్వేషన్ కోటాను ప్రకటించారు. 4 ఏళ్లపాటు ఉద్యోగం చేసే సమయంలో రూ 48 లక్షల ఇన్సూరెన్స్ వస్తుందని సంజయ్ చెప్పారు.
దీనికి తోడు అదనంగా మరో రూ 44 లక్షలు కేంద్రం ఇస్తోందని, ఈ సర్వీసులో అంగవైకల్యం కలిగితే కూడా పరిహారం అందజేస్తుందని తెలిపారు. ఇంత గొప్ప స్కీం అగ్నిపథ్ని అంటూ రుద్యోగిగా ఉంటే ఏం వస్తుంది? అని ప్రశ్నించారు. ఆర్మీలో పనిచేస్తే గౌరవం, దేశభక్తి పెరుగుతుందని తెలిపారు. అగ్నిపథ్ లాంటి పథకాలు చాలా దేశాల్లో అమలు చేస్తున్నారని పేర్కొంటూ ఈ పథకంపై ఏమైనా అనుమానాలు, అపోహలుంటే నివృత్తి చేసుకోవాలి తప్ప విధ్వంసాలు పాల్పడమేంది? అని ప్రశ్నించారు.