అన్నాడీఎంకేలో నాయకత్వం విషయమై మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీరుసెల్వంల మధ్య చెలరేగిన వివాదం ప్రస్తుతం భారత ఎన్నికల కమీషన్ ముంగిటకు చేరింది. పార్టీలో పరిణామాలపై పన్నీరు సెల్వం ఈసీకి ఫిర్యాదు చేశారనే సమాచారంతో పళని శిబిరం వ్యూహాలకు పదును పెట్టింది.
గత వారం జరిగిన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో కోర్టు ధిక్కారం జరిగినట్టు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలైంది. తనకు వ్యతిరేకంగా పళని శిబిరం దూకుడు పెంచడంతో ఎత్తుకు పైఎత్తు వేసే పనిలో పన్నీరు సెల్వం ఉన్నారు. సమన్వయ కమిటీ కన్వీనర్ అనుమతి లేకుండా జూలై 11న మరో మారు సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు చేయడం వంటి పరిణామాలను వివరిస్తూ పన్నీరు సెల్వం కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి.
ఆ సమావేశాన్ని అడ్డుకోవడమే కాకుండా, రెండాకుల చిహ్నాన్ని మరోమారు స్తంభింపజేయడానికి తగ్గ వ్యూహాల్లో పన్నీరు ఉన్నట్టు ప్రచారం జోరందుకుంది. ఇది కాస్త పళని శిబిరంలో కలవరాన్ని రేపినా, సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన వ్యూహాలకు మద్దతుదారులు పదును పెట్టారు.
సర్వసభ్య సమావేశానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, పార్టీలో పన్నీరు రూపంలో ఎదురు అవుతున్న పరిణామాలను ఎన్నికల కమిషన్కు వివరించేందుకు తగ్గ నివేదిక సిద్ధం చేసే పనిలో పళని మద్దతు నేతలు ఉన్నారు. మరోవంక, శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్ వేదికగా సర్వసభ్య సమావేశం జరిగి తీరుతుందని అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ స్పష్టం చేశారు.
కాగా, పళనిస్వామికి రోజురోజుకూ బలం పెంచుకొంటున్నారు. పన్నీరు సెల్వం వెన్నంటి ఉన్న వారిలో 9 మంది సర్వసభ్య సమావేశం సభ్యులు పళనికి జై కొట్టారు. అన్నాడీఎంకేలో మొత్తం 2,665 మంది సర్వసభ్య సమావేశం సభ్యులు ఉండగా, 2,432 మంది పళని వైపు ఉన్నారు.
ఇలా ఉండగా, గత ఎన్నికల్లో అన్నాడీఎంకే పరాజయానికి ప్రధాన కారణం తమ పార్టీలోని ద్వంద్వ నాయకత్వమేనని మాజీ మంత్రి పి.వళర్మతి విమర్శించారు. డీఎంకేతో ఎవరు సంబంధం పెట్టుకున్నా వారిని తక్షణం పార్టీ నుంచి బహిష్కరించాలన్నదే అన్నాడీఎంకే సిద్ధాంతమని పేర్కొంటూ పార్టీ కన్వీనర్ ఒ.పన్నీర్సెల్వం ఏకంగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి స్టాలిన్పై పొగడ్తల వర్షం కురిపించారని ఆమె గుర్తు చేశారు.
గత ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోవడానికి, డీఎంకే విజయానికి ప్రధాన కారణం ద్వంద్వ నాయకత్వమేని ఆమె ధ్వజమెత్తారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకే తిరిగి విజయం సాధించాలంటే ఏక నాయకత్వం కావాలని ప్రతి కార్యకర్త కోరుకుంటున్నారని ఆమె చెప్పారు. అందువల్ల ఎడప్పాడి పళనిస్వామికి పార్టీ పగ్గాలు అప్పగించాలన్నదే అని ఆమె స్పష్టం చేశారు. పార్టీ నుంచి పన్నీర్సెల్వంను బహిష్కరించాలంటూ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.