మహారాష్ట్రలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభానికి నేటితో తెరపడింది. శివసేన అసమ్మతి వర్గ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో చేపట్టిన బలపరీక్షలో అలవొకగా నెగ్గారు. బలపరీక్షకు అవసరమైన మెజార్టీ మార్కును ఆయన సాధించారు. షిండేకు 164 మంది మద్దతు ప్రకటించారు. 99 వ్యతిరేకంగా ఓట్లు వచ్చాయి.కాగా, పలువురు కాంగ్రెస్ నేతలు ఈ
ఓటింగ్లో పాల్గనలేదని తెలుస్తోంది. సోమవారం అసెంబ్లీ మొదలు కాగానే స్పీకర్ విశ్వాస పరీక్ష చేపట్టారు. తొలుత మూజువాణీ పద్ధతి ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించగా.. ప్రతిక్షాలు డివిజన్ ఆఫ్ ఓట్ పద్ధతిలో చేపట్టాలని డిమాండ్ చేశాయి. ఇందుకు అంగీకరించిన స్పీకర్.. డివిజన్ ఆఫ్ ఓటింగ్ పద్ధతిలో చేపట్టారు.
ప్రస్తుతం చీలిన శివసేన వర్గంలో.. షిండే వైపు మొత్తం 40 మంది ఎమ్మెల్యేలున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాకరేపై తిరుగుబావుటా ఎగుర వేసిన షిండే వర్గం.. అసోంలోని హోటల్లో మకాం వేసిన సంగతి తెలిసిందే.
తామే బాల్థాకరేకు అసలైన వారసులమని పేర్కొంటూ.. ఉద్ధవ్పై తిరుగుబాటు ప్రకటించారు. చివరకు బిజెపితో చేతులు కలిపిన షిండే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలో పావులు కదిపిన బిజెపి ‘ఆపరేషన్ మహారాష్ట్ర’ను అమలు చేసింది. షిండేను ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించింది.