ప్రముఖ సినీ నటుడు మిథున్ చక్రవర్తిని రాజ్యసభకు నామినేట్ చేయాలని బిజెపి అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. గత ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరి, ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఆయన ఆ తర్వాత మౌనంగా ఉంటూ వచ్చారు.
అయితే అకస్మాత్తుగా సోమవారం కలకత్తాలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి ఆయన రావడం గమనించిన వారికి బిజెపి ఢిల్లీ నేతల పిలుపు మేరకే వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో నామినేట్ సభ్యుల ఖాళీలు ఏడు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ నుండి రూప గంగోపాధ్యాయ, స్వపన్ దాస్గుప్తాల పదవీకాలం ముగిసింది. వారిద్దరి స్థానంలో తిరిగి బెంగాల్ నుండి అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్ర నాయకత్వం కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తున్నది.
హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశ పెడుతూ తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బిజెపి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. ఐతే బెంగాల్ లో బలమైన శ్రేణులు బిజెపికి ఉన్నప్పటికీ ప్రజాకర్షణగల నేతల కొరత ఉంది.
గత ఏడాది ఎన్నికలలో స్టార్ కాంపైనర్ గా వ్యవహరించిన మిథున్ ఆ తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయంగా క్రియాశీలకంగా లేవు. బెంగాల్ లో పార్టీకి ప్రజాకర్షణ గల నాయకుల అవసరాన్ని గుర్తించిన బిజెపి నాయకత్వం ఆయనను రాజ్యసభకు పంపాలనే ఆలోచనలు ఉన్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలలో మాదిరిగా కాకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో నామినేట్ సభ్యులకు కూడా ఓట్ హక్కు ఉంటుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల పక్రియ ప్రారంభమైనది. వచ్చేనెల 8న ఓటింగ్ జరగబోతున్నది. అందుకనే ఈ లోగానే రాజ్యసభలో నామినేట్ సభ్యుల ఖాళీల భర్తీకి బిజెపి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
మిథున్ సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సుకాంత మజుందార్తో సమావేశమయ్యారు. మిథున్ను రాబోయే రోజుల్లో రాష్ట్ర బీజేపీకి ఎలా చురుగ్గా ఉపయోగించుకుంటారనే దానిపై ప్రాథమిక చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈసారి బీజేపీకి పూర్తి స్థాయిలో అండగా ఉంటానని, పార్టీ ఇచ్చిన పనిని కొనసాగిస్తానని మిథున్ చక్రవర్తి ప్రకటించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.