మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన నాయకత్వంపై ఆ పార్టీ ఎమ్యెల్యేలే ఏకనాథ్ షిండే నాయకత్వంలో తిరుగుబాటు జరిపి, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం, బిజెపి మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఇతర బిజెపియేతర ప్రభుత్వాలున్న ఇతర రాష్ట్రాలలో సహితం అటువంటి `షిండే’ల కోసం అన్వేషణ జరుగుతుందా? బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ మాటలు అటువంటి అనుమానాలు కలిగిస్తున్నాయి.
టీఆర్ఎస్ లోకట్టప్పలు సిద్ధంగా ఉన్నారని, మహారాష్ట్ర తరహాలో వారంతా తిరుగుబాటు చేస్తారని ఢిల్లీలో ప్రకటించి ఓ బాంబు పేల్చారు. టీఆర్ఎస్లో కూడా కట్టప్పలున్నారని, వాళ్లు ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. పుత్ర వాత్సల్యం కారణంగా మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాలు ఎలా కూలిపోయాయో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అలాగే కూలిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేరిక కేవలం ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందున్నదని హెచ్చరించారు.
అంటే కేసీఆర్ నాయకత్వంపై తిరుగుబాటుకు తెరవెనుక రంగం సిద్దమవుతున్నదా? అనే సందేహాలు జరుగుతున్నాయి. అదే నిజమైతే `తెలంగాణ షిండే’ ఎవ్వరు? లక్ష్మణ్ చెబుతున్న `కట్టప్ప’ ఎవ్వరు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శుక్రవారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సౌత్ అవెన్యూలో ప్రత్యేక ఏర్పాటు చేసిన ఓ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజ్యసభలో సభాపతి ఎం. వెంకయ్య నాయుడు నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఈ మధ్యనే రాజ్యసభకు ఎన్నికైన డా. లక్ష్మణ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన్ను బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ నేతలు, మాజీ ఎంపీలు, తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు అభినందించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్, పెద్దల సభలో తెలంగాణ వాదన వినిపించేందుకు పార్టీ నాయకత్వం తనను ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఎంపిక చేశారని చెప్పారు. తెలంగాణ పట్ల జాతీయ నాయకత్వానికి ఉన్న చిత్తశుద్ధికి, నిబద్ధతకు ఇదే నిదర్శనమని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడానికి కృషి చేస్తానని వెల్లడించారు.
నాలుగు దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్న తనకు దక్కిన ఈ అవకాశం కార్యకర్తలకు దక్కిన గుర్తింపుగా లక్ష్మణ్ అభివర్ణించారు. బీజేపీ అగ్రనాయకత్వం వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ అనేక పదవులు, బాధ్యతలు అప్పగిస్తోందని చెప్పారు. దక్షిణాదికి పెద్దపీట వేస్తూ రాష్ట్రపతి కోటాలో నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా లక్ష్మణ్ గుర్తుచేశారు.
తెలంగాణ వ్యవహారాల గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో దోచుకున్నది చాలదన్నట్టు సీఎం కే. చంద్రశేఖర రావు ఇప్పుడు జాతీయస్థాయిలో దోచుకోవాలనుకున్నారని ధ్వజమెత్తారు. అయితే అభాసుపాలయ్యారని హెచ్చరించారు. జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు.
ఓవైపు పదే పదే ఎన్నికలతో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా జమిలి ఎన్నికల కోసం బీజేపీ ప్రయత్నిస్తుంటే, దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ప్రయత్నిస్తున్నారని లక్ష్మణ్ దుయ్యబట్టారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని అని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు ప్రజలు బుద్ధిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మహారాష్ట్ర శివసేన తరహాలో టీఆర్ఎస్లో కట్టప్పలు సిద్ధంగా ఉన్నారని, సమయం చూసుకుని రెబెల్ నేతలు తిరుగుబాటు చేస్తారని డా. లక్ష్మణ్ వెల్లడించాయిరు. అయితే ఈ కట్టప్పల విషయంలో బీజేపీ ప్రేక్షకపాత్రకే పరిమితమవుతుందని చెప్పారు. మహారాష్ట్రలోనూ ప్రభుత్వాన్ని కూల్చింది బీజేపీ కాదని ఆయన సూత్రీకరించారు. తెలంగాణలోనూ ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతోందని డా. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.