సంస్కృత భాషను ప్రతి ఒక్కరికీ చేరవేయడాన్ని ప్రజాఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపిచ్చారు. శనివారం బెంగళూరులోని కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం 9వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి, సంస్కృత భాష పరిరక్షణ అవసరాన్ని ప్రస్తావించారు.
భారత దేశ ఆత్మను అధ్యయనం చేయడంలో సంస్కృత భాషను ప్రతి ఒక్కరు అధ్యయనం చేయడం చాలా అవసరమని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికంగా వస్తున్న మార్పులను సద్వినియోగం చేసుకుంటూ సంస్కృతంతో పాటు ఇతర ప్రాచీన భారతీయ భాషలను సంరక్షించు కోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రాచీన రాత ప్రతులు, శిలాశాసనాలు, శాసనాల డిజిటలీకరణ, వేదాధ్యయన రికార్డింగ్, తత్సంబంధిత పుస్తకాల ప్రచురణలను చేపట్టడంతో పాటుగా సంస్కృత భాష్యాలను సులువుగా నేర్చుకోవడంతో పాటు, అర్థం చేసుకునేందుకు వీలైన అంశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తత్వ, మత సంబంధమైన అంశాలను తెలుసుకునేందుకు మాత్రమే సంస్కృతాన్ని పరిమితం చేయకూడదని స్పష్టం చేశారు. ఆయుర్వేదం, యోగ, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు, ధాతుశోధన శాస్త్రం (మెటలర్జీ), జ్యోతిష్యశాస్త్రం, కళలను అధ్యయనం చేసేందుకు కూడా సంస్కృతం అవసరం ఎంతగానో ఉందని వెంకయ్య నాయుడు చెప్పారు.
ప్రతి విద్యార్థి భారతీయ విజ్ఞాన ఖనిని వెలికితీసి తమ జీవితాలను మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు సంస్కృతాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలని ఆయన సూచించారు. ప్రాచీన భాషల పరిరక్షణ విషయంలో కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం పోషిస్తున్న పాత్రను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రశంసించారు.
భాషా పరిశోధనకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తూ సమకాలీన ప్రపంచానికి అవసరమైన అంశాలను అందుకునే దిశగా ఈ పరిశోధనలను జరగాలని ఆయన సూచించారు. తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన హోదా దక్కడం ఆయా భాషల ప్రాధాన్యతను తెలియజేస్తుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, బసవేశ్వరుడు వంటి ఎందరో మహనీయుల పాదస్పర్శతో పునీతమైన కర్ణాటకలో జ్ఞాన, తత్వనిధికి కొరత లేదని చెబుతూ దీన్ని వెలికితీయడంపై సంస్కృత విశ్వవిద్యాలయం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
ఈ సందర్భంగా ఆచార్య ప్రద్యుమ్న, డాక్టర్ వీఎస్ ఇందిరమ్మ, విద్వాన్ ఉమాకాంత భట్లకు గౌరవ డాక్టరేట్లను ఉపరాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్, విశ్వవిద్యాల ఉపకులపతి ప్రొఫెసర్ కేఈ దేవనాథన్ పాల్గొన్నారు.