తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు మరో 17 నెలలో జరుగవలసి ఉండగా, ఇప్పటి నుండే ముందస్తు ఎన్నికల వేడి రాజుకొంటున్నది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సై అంటే సై అంటున్నాయి. మోదీ సర్కారుపై అగ్గిమీద గుగ్గిలమవుతున్న సీఎం కేసీఆర్ దమ్ముంటే ముందస్తు ఎన్నికల డేట్ ఫిక్స్ చేయాలని, తాను కూడా సిద్ధమని బీజేపీకి సవాల్ విసిరారు.
దానిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎ న్నికలు ఎప్పుడొచ్చినా రెడీ అంటూ ప్రతి సవాల్ విసిరారు. మరోవంక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సైతం ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటూ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు 2023 నవంబర్ వరకు గడువుంది.
2014లో తొలిసారి అధికారం చేపట్టిన కేసీఆర్ గడువుకు 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేశారు. ఈసారి కూడా ఆయన అదే వ్యూహాన్ని అమలుచేస్తారని ప్రతిపక్షాల అనుమానిస్తున్నాయి. అందుకే ఒకవైపు బీజేపీని రెచ్చగొడుతూనే మరోవైపు ఎన్నికల తేదీ ప్రకటిస్తే అసెంబ్లీ రద్దు చేస్తానంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది.
కేసీఆర్ పాలనపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి నెలకొందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడంతో ఎన్నికలు ఆలస్యం అయినకొద్దీ అధికార పక్షంకు ప్రతికూలత పెరగవచ్చని అభిప్రాయంతో వచ్చే ఏడాది మొదట్లోనే ఎన్నికలకు వెళ్లవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెడుతున్నారనే బలమైన అభిప్రాయంతో కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఎన్నికల సన్నాహాలు ప్రారంభించాయి. ఇతర పార్టీల నుండి చేరికలు ప్రోత్సహించడం, భారీ జనసమీకరణ ద్వారా పార్టీ శ్రేణులను ఉత్సాహ పరచడం, క్షేత్రస్థాయిలో లోటుపాట్లను సరిదిద్దుకోవడం వంటి చర్యలలో మునిగిపోతున్నారు.
బిజెపి అయితే హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశం జరపడం ద్వారా దేశంలో తదుపరి అధికారం తెలంగాణాలో అధికారం చేపట్టే లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈ విషయమై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్వయంగా రాష్ట్రంలోని పార్టీ వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు.
కాంగ్రెస్ సహితం తాము వెనుకబడిపోబోమని అంటూ హడావుడి చేస్తున్నది. వచ్చే రెండు,, మూడు నెలల్లో రాహుల్ గాంధీతో రాష్ట్రంలో రెండు బహిరంగసభలు జరిపే ఆలోచనలు చేస్తున్నారు. గ్రామ స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమకూర్చుకోవలసి అవసరాన్ని గుర్తించిన బిజెపి జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకులను నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటనలు జరుపుతూ, రాత్రిపూట గ్రామాలలో మకాం చేయాలని ఆదేశించింది.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, గ్రూపు రాజకీయాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో హైకమాండ్ మొదట సీనియర్లను బుజ్జగించే పనిలో పడింది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ రెండు రోజుల పాటు సీనియర్లతో భేటీ అయ్యారు.
మరోవంక, ముందుస్తు ఎన్నికలకు సిద్ధమన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. నిజానికి నిన్న మొన్నటి వరకు కూడా పార్టీలో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం మీడియాతో మాట్లాడిన కేసీఆర్. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.
కానీ ఆ తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులు ముఖ్యంగా ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, కొందరు నాయకులు పార్టీని వీడటంతో వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా ఎలాంటి సంకేతాలు లేవని తెలుస్తున్నది.