ఝార్ఖండ్కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద మొత్తంలో నగదుతో పోలీసులకు పశ్చిమ బెంగాల్ లో పట్టుబడ్డారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన జరిగింది. అయితే, తమ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ ఆరోపించారు.
ఒక ఎస్యువి వాహనంలో పశ్చిమ బెంగాల్లోని హావ్డాలో రాణిహటి వద్ద జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ముగ్గురు ఎమ్మెల్యేలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఎమ్మెల్యేలను ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచ్చప్, నమన్ బిక్సాల్ కొంగరిలుగా గుర్తించారు.
ఒక నల్ల కారులో పెద్ద మొత్తంలో డబ్బు రవాణా అవుతున్నట్లు తమకు సమాచారం అందిందని, దీంతో వాహనాల తనిఖీ మొదలుపెట్టామని హావ్డా ఎస్పి స్వాతి భంగాలియా తెలిపారు. ఝార్ఖండ్ ఎమ్మెల్యేల ఎస్యువి వాహనంలో భారీ నగదు బయటపడిందని చెప్పారు.
నగదును లెక్కించడానికి యంత్రాలను తెప్పించామని, ఎమ్మెల్యేలను విచారిస్తున్నామని పేర్కొన్నారు. వాహనంలో ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని చెప్పారు.
కాగా, రాష్ట్రంలోని హేమంత్ సొరెన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఈ ఘటన స్పష్టం చేసిందని కాంగ్రెస్ పేర్కొంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేస్తానని ఝార్ఖండ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు బంధు టిర్కే తెలిపారు.
జెఎంఎం నేతృత్వంలోని ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపి బేరసారాలు జరుపుతుందన్న వార్తల నేపథ్యంలో ఈ నగదు లభ్యమైందని తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది.