పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారంనాడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్కు నాలుగు రోజుల ముందే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడటం విశేషం. వరుసగా ఏడోసారి పార్లమెంట్ సమావేశాలు నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ముగిశాయి.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటిస్తూనే, 16 రోజుల పాటు సభ సమావేశమయిందని, ఏడు చట్టాలను ఆమోదించామని చెప్పారు. ఈనెల 10న పదవీ విరమణ చేయనున్న రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు సైతం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
సభ 38 గంటలు పని చేసిందని.. 47 గంటల కంటే ఎక్కువ వాయిదాలతోనే వృథా అయ్యిందని ప్రకటించారాయన. ఇక పార్లమెంట్ సమావేశాల పేరిట చేసిన పద్దుల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం జూలై 18న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12వ తేదీతో ముగియాల్సి ఉన్నాయి.
మిగిలిన ఐదు రోజుల్లో రెండు రోజులు సెలవులే ఉన్నాయి. ఒకటి ఆగష్టు 9వ తేదీ మొహర్రం, మరొకటి ఆగస్టు 11 రక్షా బంధన్. ఈ రెండు రోజులు ఎలాగూ సభలు జరగవు. పండుగల కోసం వాళ్ల వాళ్ల నియోజకవర్గాలు, స్వస్థలాలకు ఎంపీలు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. ప్రభుత్వానికి చాలామంది ఎంపీలు విజ్ఞప్తి చేయగా.. ఐదు రోజులు ముందుగానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి.
ధరల పెరుగుదల అంశం చర్చగా.. విపక్షాల నిరసనలతో తొలి రెండువారాల పాటు సభాకార్యక్రమాలు అసలు జరగనేలేదు.ఒక వారం పాటుగా మాత్రమే ఉభయ సభాకార్యకలాపాలు సాగాయి. అయితే.. సమయం సంగతి ఏమోగానీ.. చట్టపరమైన ఎజెండా మాత్రం సంతృప్తికరంగా ఉన్నట్లు పార్లమెంట్ వర్గాలు చెప్తున్నాయి.