బీజేపీలో అత్యున్నత కమిటీలు రెండింటిలో తెలంగాణకు చెందిన పార్టీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించిన పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలు రెండింటిలోనూ ఆయన సభ్యుడిగా కొనసాగుతారు.
రాష్ట్ర బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన తెలంగాణకు చెందిన డాక్టర్ కోవా లక్ష్మణ్కు జాతీయ పార్టీకి సంబంధించిన రెండు అత్యున్నతస్థాయి కమిటీల్లో స్థానం లభించింది. అత్యున్నత నిర్ణాయక కమిటీలైన పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీల్లో కె.లక్ష్మణ్ను సభ్యుడిగా బీజేపీ అధిష్టానం నియమించింది.
తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతూ రాష్ట్ర బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు అన్నివిధాలుగా గుర్తింపునిస్తోంది. దక్షిణాది నుంచి కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పతో పాటు లక్ష్మణ్ మాత్రమే పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా ఉన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలోని బోర్డులో సభ్యులుగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సర్బానంద సోనోవాల్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, ఇక్బాల్ సింగ్, సుధా యాదవ్లకు చోటు కల్పించారు.
గతంలో పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లను పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించారు. మరోవైపు బీజేపీ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సభ్యుల పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించింది.
మొత్తం15 మంది సభ్యుల్లో రాష్ట్రం నుంచి కె. లక్ష్మణ్తో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫఢ్నవిస్ కు కొత్తగా చోటు కల్పించింది. జేపీ నడ్డా నేతృత్వంలోని ఈ బోర్డులో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్, కే లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్పుర, సుధా యాదవ్, సత్యనారాయణ జటియా , కేఎల్ సంతోష్, కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్, ఓమ్ మథుర్, వనతి శ్రీనివాస్లకు చోటు కల్పించారు.
ఇప్పటికే లక్ష్మణ్ను పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, ఇటీవల యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసిన జాతీయ నాయకత్వం తెలంగాణకు, ముఖ్యంగా వెనుకబడినవర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతను వెల్లడించింది. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి నగర పార్టీ అధ్యక్షుడిగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, బీజేఎల్పీనేతగా, పార్టీ అధ్యక్షుడిగా, వెనుకబడిన వర్గాలకు చెందిన నేతగా లక్ష్మణ్ తనదైన గుర్తింపు పొందారు.
2017లో ఉపరాష్ట్రపతి అయ్యేదాకా తెలుగు రాష్ట్రాల నుంచి వెంకయ్య పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఉండేవారు. చిత్తశుద్ధితో పని చేసే నేతలను, వారి అనుభవాన్ని పార్టీ ఎంతగా గుర్తిస్తుందో చెప్పేందుకు లక్ష్మణ్ తదితరులకు అవకాశమే తాజా నిదర్శనమని బీజేపీ వర్గాలు తెలిపాయి. ‘‘లక్ష్మణ్, యడియూరప్ప, జతియా పార్టీ కోసం తమ జీవితాలను ధారపోశారు. ఒక్కో ఇటుకా పేర్చి పార్టీ నిర్మాణానికి పాటుపడ్డారు’’అంటూ కొనియాడాయి.