జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో లక్ష్మణ్ పాల్గొని, పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సర్థార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా నందనం కృపాకర్ రాసిన మరో ఛత్రపతి మన తెలుగు దళపతి పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ జాతి గర్వపడే విధంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన సర్వాయి పాపన్న జయంతి జరుపుకుంటున్నామని తెలిపారు.
తాడిచెట్టుపై పన్ను విధించిన నియంత పాలనపై పాపన్న వీరోచితంగా పోరాడారని తెలిపారు. నేటి యువతకు ఆయన స్ఫూర్తి అని చెప్పారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. టాంక్బండ్పై ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. గోల్కొండ కోటగా సామ్రాజ్యాన్ని స్థాపించి బడుగుల రాజ్యాధికారం కోసం కృషి చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు.
మహ్మదీయుల ఆగడాలు, అకృత్యాలపై పోరాడిన వీరుడు సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ అంటూ మొగలాయిలు, నిజాం రజాకార్ల అరాచకాలను ఎదరించారని గుర్తు చేశారు. 13 మాసాలు ఇక్కడి ప్రాంత ప్రజలు కుల వృత్తుల అస్త్రాలనే ఆయుధాలుగా మల్చుకుని నిజాం, రజాకాలర్ల మీద పోరాటం చేశారని చెప్పారు.
తెలంగాణ గడ్డ మీద స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ , చాకలి ఐలమ్మ , దొడ్డికొమురయ్య వంటి వారి పోరాట ఫలితమని స్పష్టం చేశారు. సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరగబడాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. కానీ ఇప్పటి తెలంగాణలో నియంత పాలన సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్పై యువత తిరగబడాల్సిన అవసరం ఉందని చెబుతూ బిజెపి అండగా యువత పోరాటం చేసేందుకు ముందుకు రావాని పిలుపిచ్చారు,
కేసీఆర్ కుటుంబ పాలనకు యువత చరమగీతం పాడాలని కోరుతూ నిజాం తరహా పాలనను కేసీఆర్ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనను భూస్థాపితం చేయడమే.. సర్వాయి పాపన్నకు ఘనమైన నివాళి అవుతుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో అవినీతి పాలన నడుస్తోందని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబ పాలనకు, కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడాలన్నారు. బీజేపీతో కలిసి తెలంగాణ వాదులు, మేధావులు, యువత, ప్రజలు టీఆర్ఎస్ పై పోరాటం సాగించాలని కోరారు.
కాగా, తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయమని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి అమిత్ షా సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో తనకు చోటు దక్కడం.. సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవమన్నారు. ప్రజలు కోరుకున్నందునే మునుగోడుకు ఉపఎన్నిక వచ్చిందని తెలిపారు. భవిష్యత్ లేకనే కేంద్రం, ప్రధానిపై సీఎం కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉపఎన్నికలకు ముందే అధికార టీఆర్ఎస్ కాడి పడేసిందని ఎద్దేవాచేశారు. దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలు మునుగోడు ఉపఎన్నికలో పునరావృతం అవుతాయని లక్ష్మణ్ జోస్యం చెప్పారు.