దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత మృతి కేసులో విచారణ ఐదేళ్లకు ముగిసింది. శనివారం ముఖ్యమంత్రి స్టాలిన్కు విచారణ జరిగిన కమీషన్ కు నేతృత్వం వహించిన ఆర్ముగ స్వామి 600 పేజీల నివేదికను సమర్పించారు.
ఈ నివేదికను సమగ్రంగా పరిశీలించాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. అలాగే, ఈనెల 29వ తేదీన మంత్రి వర్గం భేటీ కావాలని నిర్ణయించారు. 2016 డిసెంబర్ 5న అప్పటి సీఎం జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.
ఆమె మరణంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి 2017 సెప్టెంబర్ 24న హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిషన్ను ప్రకటించారు. అదే ఏడాది అక్టోబర్ 27వ తేదీ నుంచి∙విచారణను ఆర్ముగ స్వామి కమిషన్ ప్రారంభించింది.
ఐదేళ్ల పాటుగా సాగిన విచారణకు అనేక అడ్డంకులు తప్పలేదు. రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ విచారణలో తమ వైద్యులు తెలియజేస్తున్న అంశాలు, వివరాలు బయటకు రావడం, అవన్నీ కొత్త వాదనలకు దారితీయడంతో అపోలో యాజమాన్యం కోర్టు తలుపు తట్టింది.
తమను ప్రత్యేకంగా విచారణ పరిధిలోకి ఈ కమిషన్ తీసుకు రావడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అపోలో యాజమాన్యం సవాలు చేసింది. ఈ పరిణామాలతో రెండేళ్ల కాలం వృథా అయ్యింది. గత ఏడాది పగ్గాలు చేపట్టిన డీఎంకే సర్కారు సైతం ఈ కమిషన్ పదవీ కాలాన్ని పొడిగించి విచారణను త్వరితగతిన ముగించాలని ఆదేశించాల్సి వచ్చింది.
అదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణ ముగియడం, ఆర్ముగ స్వామికి సహకారంగా ఎయిమ్స్ వైద్యులు రంగంలోకి దిగడంతో మార్గం సుగమమైంది. గత కొన్ని నెలలుగా ఎయిమ్స్ వైద్య బృందం సహకారంతో ఆర్ముగ స్వామి కమిషన్ వైద్యపరంగా తమకు ఉన్న అనుమానాల్ని నివృతి చేసుకుంది. విచారణను వేగవంతం చేసింది.
ఈ కేసులో 159 మందిని విచారించారు. 8 మంది వద్ద లిఖిత పూర్వకంగా ప్రమాణ పత్రాలను సేకరించారు. ఈ కేసులో తొలి విచారణ డాక్టర్ శరవణన్తో మొదలు కాగా, చివరగా అన్నాడీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంతో ముగించారు.