తెలుగు రాష్ట్రాలలో తిరిగి తెలుగు దేశం పార్టీతో పొత్తు ఏర్పర్చుకోవాలని బిజెపి నాయకత్వం నిర్ణయించిందని, త్వరలో ఎన్డీయే లోకి టిడిపి తిరిగి చేరబోతున్నదని కొద్దిరోజులుగా మీడియాలో వస్తున్న వార్తాకథనాలు బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ తోసిపుచ్చారు. బీజేపీ, టీడీపీ పొత్తుపై ఎలాంటి చర్చలు కూడా జరగడంలేదని ఆయన స్పష్టం చేశారు.
టీడీపీతో పొత్తు అంశం వార్తలకే పరిమితమని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఆంద్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ తో కలసి పోటీ చేస్తుందని ప్రకటించారు, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు బీజేపీ పెరుగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.
బిహార్ పర్యటనతో కేసీఆర్ అబాసు
ఇలా ఉండగా, బిహార్ పర్యటనతో కేసీఆర్ అబాసు పాలయ్యారని డా. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఇంట గెలవకుండా రచ్చకెళ్తున్నారని అంటూ కేసీఆర్ పదిసార్లు బతిమాలినా బిహార్ సీఎం నితీష్ కుమార్ కూర్చోలేదని తెలిపారు. నితీశ్ కుమార్, కేసీఆర్ ను పట్టించుకోలేదని.. కేసీఆర్ తెలంగాణ పరువు తీశారని దయ్యబట్టారు.
తెలంగాణలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే కేసీఆర్ బిహార్ పర్యటనకు వెళ్లారని విమర్శించారు. నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు కనిపిస్తుందని అంటూ రాహుల్ గాంధీ మీ నాయకుడా..? ఎవరు మీ నాయకుడు అంటే కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పారని డా. లక్ష్మణ్ గుర్తు చేశారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పదే పదే కూర్చోమని బ్రతిమిలాడే పరిస్థితి కేసీఆర్ కు వచ్చిందని ఎద్దేవా చేశారు. గల్వాన్ లోయలో చనిపోయిన వారికి సహాయం చేస్తే తప్పు లేదన్న లక్ష్మణ్.. తెలంగాణలో చనిపోయిన వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ ఎందుకు ఆదుకోవడంలేదని నిలదీశారు.
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ పట్టించుకోవడంలేదని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్, ఫాంహౌస్ కే పరిమితమైన కేసీఆర్ అదే ప్రపంచమనుకుంటున్నారని విమర్శించారు. ఇప్పుడు దేశ రాజకీయమంటూ కొత్త నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని మునుగోడు భయం కేసీఆర్ కు బాగా పట్టుకుందని లక్ష్మణ్ తెలిపారు. కూరగాయల ధరలు పెరుగుతున్నాయంటున్న సీఎం కేసీఆర్ మన రాష్ట్రానికి కూరగాయలు పక్క రాష్ట్రాల నుంచి వస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. క్యాబేజీ కర్ణాటక నుంచి, టమాట, బెండకాయలు ఏపీ నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.