దేశం కోసం బీజేపీ ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల వ్యాఖ్యానించడంపై రాజ్యసభలో మంగళవారం పెద్ద రచ్చ రేగింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలంటూ బిజెపి నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అందుకు నిరాకరించడంతో సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా రెండు పార్టీల నేతలు పరస్పరం నిందారోపణలు దిగారు. కాగా, సభ్యుల ప్రవర్తన పట్ల ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ అసహనం వ్యక్తం చేశారు.
‘‘సభలో ఇలాంటి ప్రవర్తన మనకు చాలా చాలా చెడ్డ పేరు తెస్తుంది.. సభ నడిచే తీరుతో బయట ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారు. కనీసం సభాపతి సూచనలను కూడా పట్టించుకోవడం లేదు… ఎంతటి బాధాకర పరిస్థితిని సృష్టిస్తున్నాం.. నమ్మండి.. మనల్ని చూసి 135 కోట్ల మంది ప్రజలు నవ్వుకుంటున్నారు’’ అని ధన్కర్ మండిపడ్డారు.
‘‘అది పార్లమెంట్ వెలుపల జరిగింది… అటువంటి వ్యాఖ్యలకు ఆధారాలు ఉండొచ్చు.. లేకపోవచ్చు.. దాని గురించి సభలో ఆందోళనలు సరికాదు. పక్షాల మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ రాజ్యసభ పక్ష నేత మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్ష ఎంపీలు ఆటంకం కలిగించడం.. ప్రతిపక్ష నేత మాట్లాడుతుంటే మరో పక్షం అడ్డుకోవడం.. ఇవన్నీ ఏంటీ? మనమేం పిల్లలం కాదు’’ అని సభ్యులను ఆయన సున్నితంగా మందలించారు.
‘‘సభలో ఏదైనా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించడం, అందుకు సంబంధించిన మద్దతు పత్రాలను సభ్యులు తన ముందుంచాలి. నేను రాజ్యాంగపరమైన నా విధులను నిర్వర్తిస్తున్నాను. వాళ్లు అధికార పక్షమా.. ప్రతిపక్షమా అని చూడను.. కేవలం రాజ్యాంగ ధర్మాన్ని పాటిస్తాను’’ అని తేల్చి చెప్పారు.
మరోవైపు, తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పేందుకు ఖర్గే ససేమిరా అన్నారు. పార్లమెంట్ వెలుపల చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చ జరగాల్సిన అవసరం లేదని కొట్టిపారేవారు. ‘‘దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని మీరు క్షమాపణలు అడుతున్నారా?’’ అంటూ బీజేపీని నిలదీశారు.
అనంతరం పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. సోమవారం అల్వాల్ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ.. దేశం కోసం కాంగ్రెస్ ఎంతో చేసింది.. ఇందిరా, రాజీవ్ గాంధీతోపాటు మరెందరో కాంగ్రెస్ నాయకులు ప్రాణ త్యాగాలు చేశారు.. దేశం కోసం బీజేపీ కనీసం ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదు.. అయినా కూడా తాము దేశభక్తులమనే వారు చెబుతారు. మేమైనా అంటే దేశద్రోహులుగా ముద్ర వేస్తారు’’ అని విమర్శలు గుప్పించారు.