కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ బిజెపి ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్నట్లు ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా. కె లక్ష్మణ్ వెల్లడించారు. ఏప్రిల్లో అమిత్ షాలేదా, జేపీ నడ్టాతో తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించి, అందులో దానిని విడుదల చేస్తామని తెలిపారు. 90 అసెంబ్లీ, 400 పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బీజేపీ రూట్ మ్యాప్ సిద్ధమైందని ఆయన చెప్పారు. తెలంగాణ బచావో’ పేరుతో ప్రజల్లోకి వెళ్తామని పేర్కొంటూ బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు ఉచిత వైద్యం, విద్య అందిస్తామని స్పష్టం చేశారు.
గతంలో గెలవని 160 పార్లమెంట్ స్థానాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాల్లో గెలుపు కోసం నాలుగంచెల వ్యవస్థ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో బీజేపీ టికెట్ కోసం నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారని, తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో రూట్ మ్యాప్ రూపొందించామని చెప్పారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలవటం బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని లక్ష్మణ్ పేర్కొన్నారు.
మూడు నెలల కాలంలో వేల సంఖ్యలో మండల, జిల్లా స్థాయిలో మీటింగ్స్ ఉంటాయని, జనవరి 20 నుంచి ‘ప్రజా గోస.. బీజేపీ భరోసా’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళతామని వివరించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంటున్న విధానాన్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. కేంద్రం పంచాయతీలకు ఇస్తున్న నిధులను దోచుకుంటున్నారని టీఆర్ఎస్ సర్పంచులే చెబుతున్నారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు నాలుగంచెల వ్యవస్థతో ముందుకు వెళ్తున్నామని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనతో విసిగి పోయారని, అందుకే ‘కేసీఆర్ హఠావో…తెలంగాణ బచావో’ పేరుతో జనంలోకి వెళ్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మేధావులతో సమ్మేళనాలు, సదస్సులు నిర్వహించినట్లే ఇప్పుడు కూడా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.