రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీలను ఆర్థిక సలహా మండలి (ఈఎసి) సభ్యులుగా నియమించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఆ మండలికి నేతృత్వం వహిస్తారు. ఆ మండలిలో 21 మంది సభ్యులుగా ఉంటారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ, అదానీ పోర్ట్ సిఈవో కరణ్ అదానీలు రేవుల, ప్రత్యేక ఆర్థిక మండళ్లకు ప్రాతినిధ్యం వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
‘ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ లక్షాన్ని సాధించేందుకు ఈ ఆర్థిక సలహా మండలి కీలక భూమికను నిర్వహించగలదు. ఇదో ప్రయివేట్ పరిశోధన సంస్థగా పనిచేయనున్నది. వ్యవసాయం, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, విద్య తదితర రంగాలకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారించనున్నది’ అని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ శాసన మండలికి తెలిపారు.
మహారాష్ట్ర ఆర్థిక సలహా మండలిలో సంజీవ్ మెహతా (హిందుస్థాన్ యూనీలీవర్ లి.), అమిత్ చంద్ర (బైన్ క్యాపిటల్), విక్రమ్ లిమాయే (ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్), ఎస్.ఎన్. సుబ్రమణ్యన్ (లార్సెన్ అండ్ టూబ్రో), దిలీప్ సంఘ్వీ (సన్ ఫార్మా), అనీశ్ షా (మహీంద్రా అండ్ మహీంద్రా), శ్రీకాంత్ బడ్వే (బడ్వే ఇంజినీరింగ్) ఇతర సభ్యులుగా ఉన్నారు.